అందుబాటులో ఉంటూ రైతులకు సూచనలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 23 : రైతులకు నిత్యం అందుబాటులో ఉండి వ్యవసాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదిక భవనాలను నిర్మించింది. రైతువేదికల్లో వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటూ పంటల సాగులో రైతుల సందేహాలను ఎప్పటికప్పడు నివృత్తి చేస్తున్నారు. మండలంలోని నాలుగు క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికల్లో వ్యవసాయ విస్తీర్ణాధికారులు తమ విధులను ప్రారంభించారు. పంటల వివరాలు, సమావేశాలు, కొత్త వంగడాలు, సబ్సిడీ యంత్రాలు, విత్తనాలు, పండించిన పంటలు, పంటలకు సోకే చీడపీడల నివారణపై అవగాహన సమావేశాలు, పండించిన పంటలు ఆన్లైన్లో నమోదు, విక్రయాలకు టోకెన్లను సైతం రైతువేదికల్లో అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాల చెందిన రైతులు.. పంటల సమస్యల పరిష్కారానికి మండలకేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. స్థానికంగా ఉండే ఏఈవోలను కలిసి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
రైతు వేదికల్లో సేవలు..
మండలంలో నాలుగు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. క్లస్టర్లలో భూసారపరీక్షలు, ఆన్లైన్ సేవలు, ఏ సమయంలో ఏ పంటలు సాగుచేయాలో రైతువేదికల్లో ఉండే అధికారుల నుంచి వివరాలను తెలుసుకోవచ్చు. వ్యవసాయశాఖ అందించే రోజువారీ సలహాలు, సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్దతులు, రాయితీలు, పంట తెగుళ్ల ఉధృతిని క్షేత్రస్థాయిలో ఏఈవోలు పరిశీలిస్తూ.. ఏ మందును పిచికారీ చేయాలో రైతులకు వివరిస్తున్నారు. రైతువేదికల ద్వారా జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి వ్యవసాయశాఖ అధికారులు వారం, పదిహేను రోజుల కొకసారి పంటల సాగు తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.
అందుబాటులో ఉంటున్నాం..
రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. ప్రతిరోజూ రైతువేదికల్లో అందుబాటులో ఉంటున్నాం. పంటల సాగులో రైతులకు ఎలాంటి సందేహాలు వచ్చినా.. స్థానికంగా ఉండి నివృత్తి చేస్తున్నాం. అవసరమైతే క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
రాజాగౌడ్, ఏఈవో అన్నాసాగర్ క్లస్టర్
సమస్య వెంటనే పరిష్కారమవుతున్నది
ఇంతకుముందు పంట సాగులో సమస్య ఎదురైతే మండల వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అధికారులు అందుబాటులో లేక ఆలస్యమై పంట నష్టం ఎక్కువయ్యేది. ప్రస్తుతం రైతువేదికల్లో వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండి సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారు.
దుద్దుల సాయిరాం, రైతు, రేపల్లెవాడ