నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 21: కరోనాబారిన పడినవారు భయాందోళనకు గురికావద్దని నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. నగరంలోని 300 క్వార్టర్స్, ఇబ్రహీంనగర్, దొడ్డి కొమురయ్య కాలనీలో జ్వర సర్వేను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని మెరుగైన వైద్యసేవలు అందించడానికే జ్వర సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. ఇంట్లో సౌకర్యాలు లేనివారు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండవచ్చన్నారు. మేయర్ వెంట ప్రత్యేకాధికారి రమేశ్, ఆశవర్కర్లు ఉన్నారు. కోటగిరి మండలంలోని టాక్లీ, వల్లభాపూర్, రాంపూర్, జల్లాపల్లి అబాది, కొల్లూర్, సుంకినితోపాటు ఆయా గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించారు. పలు గ్రామాల్లో మండల అధికారులు సర్వేను పరిశీలించారు. నోడల్ అధికారి గోవింద్, తహసీల్దార్ శేఖర్, ఎంపీవో మారుతి, సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, సాయికుమారి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు. రుద్రూర్ మండలకేంద్రంలో జ్వర సర్వేను ఆర్డీవో రాజేశ్వర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందజేయాలని సర్వే బృందానికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో బాలగంగాధర్, తహసీల్దార్ ముజీబ్, సర్పంచ్ శేఖర్, కార్యదర్శి రాజేందర్ తదితరులు ఉన్నారు. ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న జ్వర సర్వేను తహసీల్దార్ జయంత్రెడ్డి పరిశీలించారు. గుడితండా పంచాయతీ పరిధిలో నిర్వహించిన సర్వేలో తహసీల్దార్ పాల్గొని వైద్య బృందం సభ్యులు సేకరిస్తున్న వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా లక్షణాలు ఉన్న ముగ్గురిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేశారు. మద్దుల్ తండాలో జ్వర సర్వే నిర్వహించగా.. ఎంపీడీవో నటరాజ్, ఎంపీవో రాజేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు అందజేసినట్లు ఎంపీడీవో నటరాజ్ తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో చేపట్టిన జ్వరసర్వేను మండల ప్రత్యేకాధికారిణి వెంకటలక్ష్మి పరిశీలించారు.
ఎంపీడీవో లక్ష్మణ్, గ్రామసర్పంచ్ లత, ఎంపీటీసీ రాజు, కార్యదర్శి హరీశ్, టీం సభ్యులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని రామ్నగర్ గ్రామంలో చేపట్టిన సర్వేను ఆర్డీవో రవి పరిశీలించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనుల గురించి కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో వెంట ఎంపీడీవో మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, ఏఎన్ఎం, ఆశవర్కర్లు ఉన్నారు. ఇందల్వాయి మండలంలోని కేకే తండా గ్రామంతోపాటు పలు గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించారు. కరోనా లక్షణాలున్న వారు తమను సంప్రదించాలని ఎంపీడీవో రాములునాయక్ సూచించారు. బోధన్ పట్టణంలోని సరస్వతీనగర్లో కొనసాగుతున్న సర్వేను బోధన్ ఆర్డీవో ఎస్.రాజేశ్వర్ పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు దగ్గరలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తకు, ఆశవర్కర్కు సమాచారం అందించి మందులు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు, సర్వే బృందాలతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 22వరకు బోధన్ పట్టణంలో ఇంటింటా సర్వే పూర్తిచేయాలని సర్వే బృందాలకు, మున్సిపల్ అధికారులకు సూచించారు.
మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఏఈ శివకృష్ణ, కౌన్సిలర్లు శరత్రెడ్డి, చందు ఉన్నారు. బోధన్ మండలం కుమ్మన్పల్లి, రాజీవ్నగర్ తండాలో సర్వే కొనసాగింది. కుమ్మన్పల్లిలో తహసీల్దార్ గఫార్ మియా సర్వేను పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, మున్సిపల్ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలతో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి సూచనల మేరకు ఆర్మూర్లో జ్వర సర్వే చేస్తున్న సిబ్బందికి ఆక్సీమీటర్లు, థర్మామీటర్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కృషితో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలందుతున్నాయన్నారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, వైస్చైర్మన్ మున్నా, కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మోర్తాడ్లో కొనసాగుతున్న రెండోవిడుత ఇంటింటి సర్వేలో తహసీల్దార్ శ్రీధర్ పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని బాగేపల్లిలో కొనసాగుతున్న సర్వేను ఎంపీడీవో గోపాలకృష్ణ, తహసీల్దార్ రామ్చందర్ పరిశీలించారు.