కామారెడ్డి టౌన్/ఇందూరు, మే 21: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. వరంగల్ నగరంలో శుక్రవారం పర్యటించిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచి వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షను నిర్వహించారు. కరోనా నియంత్రణకు చర్యలు, పాజిటివ్ రేట్ల వివరాలు, లాక్డౌన్లో తీసుకుంటున్న చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల వారీగా సమీక్షించారు. సమావేశం లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, రాష్ట్ర ఆరోగ్య సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. కరోనా కట్టడిలో భాగంగా ఈనెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తూ.. అనుమతి ఉన్న వారు తప్ప మిగితా వారు రోడ్లపైకి రాకుండా చూడాలన్నారు. పోలీసులు మరింత పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభు త్వం వేల కోట్లు నష్టపోతున్నా.. ప్రజారోగ్యం, సంక్షేమం దృష్ట్యా లాక్డౌన్ను అమలు చేస్తున్నామని, దాని ప్రభావం కచ్చితంగా కనిపించాలని సూచించారు.
విద్యుత్, తాగునీరు, శానిటరీ, ప్లంబర్ తదితర సేవలను అందించే వారికి పాస్లు జారీ చేయా లని ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్స్ అయిన పేపర్ బాయ్స్, పాలు, కూరగాయలు, మటన్, చికెన్, ఫిష్ షాపుల వారి వివరాలు పంపాలని, వారికి వ్యాక్సినేషన్ వేయడంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. దవాఖానల్లో పరిశుభ్రత ముఖ్యమని, ఎలాంటి చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, రెండు రోజుల్లో వాటి ఫలితం కనిపించాలని ఆదేశించారు. ఎక్కడ మందులు, ఇంజక్షన్ల అవసరం ఉన్నా వెంటనే సీఎస్ దృష్టికి తేవాలని, వెంటనే సరఫరా చేస్తామని చెప్పారు. అవసరం ఉన్న చోట వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలన్నారు.
నిర్విరామంగా సేవలను అందిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం అవుతున్నదని, ఈలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సంబంధింత అధికారులను సీఎం ఆదేశించారు. వీసీలో కామారెడ్డి నుంచి కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవ రావు, డీఎంహెచ్వో చంద్రశేఖర్, జిల్లా ఏరియా దవాఖానల కో-ఆర్డినేటర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ నుంచి కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు సీపీ ఉషావిశ్వనాథ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, లత, డీఎంహెచ్వో బాలనరేంద్ర, నగర కమిషనర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు.