ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతున్నది. వర్షాకాలం ఆరంభం నుంచే ప్రాజెక్టుకు భారీగా వరదలు పోటెత్తడంతో ఈసారి లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశముంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 616 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. నాలుగు టర్బయిన్ల ద్వారా రోజుకు 36 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ ఏడాది 75 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 62.8 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది.
కమ్మర్పల్లి, అక్టోబర్ 20 : ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతున్నది.ఈ వానకాలంలో ఎస్సారెస్పీకి భారీ వరదలు పోటెత్తడం జోరుగా విద్యుత్ ఉత్పత్తికి దోహదమవుతున్నది. ఈ సీజన్ మొత్తం భారీ ఇన్ఫ్లోలు కొనసాగడంతో ఉత్పత్తికి వరద ఉధృతి జోరునందిస్తున్నది. దీంతో ఈ సీజన్లో జెన్కోలో లక్ష్యం దిశగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఎస్సారెస్పీలో ఈ ఆర్థిక సంవత్సరం(2021-22) ఆది నుంచే విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా కొనసాగుతున్నది. గత వానకాలం సీజన్లో ఎస్సారెస్పీలోకి వచ్చి న ఇన్ఫ్లోల తో యాసం గి వరకు అందుబాటులో ఉన్న నీటి విడుదల కొనసాగింది. ఇది ఉత్ప త్తి సీజన్ ఆరంభంలోనే ఆశాజనక ఉత్పత్తికి తోడ్పడింది. ఇక ఈ వానకాలంలో జూన్ నుంచే ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోలు ప్రారంభమయ్యాయి. జూలై, ఆగ స్టు, సెప్టెంబర్ మాసాల్లో, అక్టోబర్లో ఇది వరకు గడిచిన రోజుల్లో క్రమం తప్పకుండా ఇన్ఫ్లోలు కొనసాగుతూ వచ్చాయి. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంతో పాటు, మంజీరా నదికి వరదలు, ప్రాజెక్టు ఎగువన మహా రాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరి నది నిత్య వరదతో ప్రవహిస్తూ ఉన్నది. దీంతో గడిచిన మూడు మాసాల్లో ప్రాజెక్టులోకి పలుమార్లు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోలు నమోదయ్యాయి.
ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 616 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. 90.313 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీకి నిరంతర ఇన్ఫ్లో రావడంతో విద్యుత్ ఉత్పత్తి సైతం వరద జోరు లాగానే కొనసాగుతూ వస్తున్నది. ఎస్సారెస్పీలో నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఒక్కో టర్బయిన్ ద్వారా తొమ్మిది మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇలా వరద ఉధృతి జోరుగా ఉంటే నాలుగు టర్బయిన్ల ద్వారా రోజుకు 36 మెగా వాట్ల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సీజన్ వరద ఇలాంటి ఉత్పత్తికే దోహపడింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా 75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పతి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 62.783 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఇందులో ఈ జూన్ నుంచి వచ్చిన ఇన్ఫ్లోతో 51 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగగా మిగతా 11 మిలియన్ యూనిట్లు గత వానకాలం వచ్చిన ఇన్ఫ్లోలతో వచ్చిన నీటితో జరిగింది. ఈ జూన్ నుంచి జరిగిన 51 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి 8.360 టీఎంసీల నీరు జెన్కోకు వదిలారు.
లక్ష్యానికి మించి..
ఈ వానకాలం సీజన్లో వచ్చిన వరదతో మూడు నెలలుగా నిండు కుండలానే ఉంటున్న ఎస్సారెస్పీ లో యాసంగి పంటల సీజన్ పూర్తయ్యే దాకా తగినంత నీరు అందుబాటులో ఉంటుంది. దీంతో నీటి విడుదల యాసంగి పూర్తయ్యే వచ్చే ఏప్రిల్ వరకు కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యానికి మించి జరిగే అవకాశం ఉంది.
విద్యుత్ ఉత్పత్తి ఇలా..
గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో విద్యుదుత్పత్తి నాలుగు సార్లు ఆశాజనకంగా, లక్ష్యం మేరకు సాగింది. 2011-12లో 88.0779, 2012-13లో 16.3455, 2013-14లో 85.0525, 2014-15లో 12.8769, 2015.16లో 0.0000, 2016-17లో 75.3555, 2017-18లో 35.6332, 2018-19లో 31.6374, 2019-20లో 48.6817, 2020-21లో 90.7658 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 62 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఇప్పటికీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదలు, ఆర్థిక సంవత్సరం ముగిసే దాకా నీటి విడుదలకు అవకాశాలు ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఎస్సారెస్పీ జెన్కోకు వరద వెలుగుల సంవత్సరంగా గుర్తుండిపోనున్నది.