నిజాంసాగర్, అక్టోబర్19: దళితులను బీజేపీ చిన్నచూపు చూస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ పేరుతో నిలిపివేశారని, దీనికి కారణమైన బీజేపీ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన నిజాంసాగర్ మండల కేంద్రంలోని దళిత కాలనీల్లో పర్యటించారు. వసతుల గురించి తెలుసుకొని పలువురు దళిత కుటుంబాలతో మాట్లాడారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చే పది లక్షల రూపాయలను ఏ విధంగా ఖర్చు చేస్తారంటూ కొన్ని కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఇందులోభాగంగా దళితులకు రూ. పది లక్షలు అందజేసే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కానీ బీజేపీ దళితులపై చిన్నచూపు చూస్తూ, వారికి అందే దళితబంధు పథకాన్ని నిలిపివేసేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు సైతం అందరితో సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ముందుగా హుజూరాబాద్ మండలాన్ని ఎంపిక చేయగా, ప్రస్తుతం మరో నాలుగు మండలాలను పైలట్ మండలాలుగా ఎంపికచేయగా, అందులో నిజాంసాగర్ మండలం కూడా ఉందని తెలిపారు. మొదటి విడుతగా నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్లు సోమవారం విడుదల చేశారని చెప్పారు. హుజూరాబాద్లో ఎన్నికల కోడ్ అంటూ బీజేపీ దళితులపై మరోమారు తన కపట ప్రేమను చాటుకుందని అన్నారు. ఇక నైనా బీజేపీ తన తీరును మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు బేగరి రాజు, రమేశ్ తదితరులు ఉన్నారు.