స్మగ్లర్ల ప్రోత్సాహంతో కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో గంజాయి సాగు మళ్లీ మొదలైంది. దీంతో ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోకుండా వారి ఆగడాలకు అడ్టుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 16 బృందాలను ఏర్పాటు చేశారు.
కామారెడ్డి, అక్టోబర్ 17 : కామారెడ్డి జిల్లాలో మళ్లీ కొరలు చాస్తున్న గంజాయిపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస దాడులతో గంజాయి సాగు చేస్తున్న క్షేత్రాలపై మెరుపుదాడులు చేస్తున్నారు. ముఖ్యం గా అటవీ ప్రాంతాల్లో, సరిహ ద్దు మండలాల పరిధిలో గంజాయి సాగు చేసేలా స్మగ్లర్లు ప్రోత్సహిస్తున్నారు. జిల్లా లో వరుస దాడులు చేస్తూ గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు. గాంధారి, సదాశివనగర్, రాజంపేట, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో పలు ప్రాంతాల్లో గంజాయి మొక్కలు లభించడంతో ఎక్సైజ్, పోలీసు శాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక బృందాలను నియమించి ఏరివేతకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తరిస్తున్న గంజాయి సాగుపై ఇందుకు ప్రోత్సహిస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అంతర పంటగా సాగు
కామారెడ్డి జిల్లా పరిధిలో మళ్లీ గంజాయి సాగు గుప్పుమంటున్నది. పంట చేలలో అంతర పంటగా గంజాయి సాగవుతున్నది. గంజాయి సాగుకు మారుముల ప్రాంతాలను, తండాలను ఎంచుకుంటున్నారు. గాంధారి, సదాశివనగర్, రాజంపేట, మద్నూర్, బాన్సువాడ, పెదకొడప్గల్, బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద తదితర మండలాల్లో గుట్టుగా గంజాయి సాగవుతున్నది. దీంతో అప్రమత్తమైన పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు 15 రోజులుగా అధికారులు వరుస దాడులు చేస్తున్నారు.
విస్తృతంగా దాడులు
15 రోజుల వ్యవధిలో 6 మండలాల్లో దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశా రు. కొన్నేండ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ ప్రాంత వాసులు మళ్లీ సాగుపై కేంద్రీకరించారు. ఈ నెల 4వ తేదీన గాంధారి మండలం పరిధిలో కొత్తబాది తండాలో పంట చేనులో గంజాయి సాగు చేసిన విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ, ఎక్సైజ్ సిబ్బంది దాడిచేయగా, ఎకరం మక్క పంటలో గంజాయి మొక్కలను గుర్తించారు. ఎకరం పంటలో సుమారు 2000 మొక్కలను గుర్తించిన అధికారులు వాటిని ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి కేసు నమోదు చేశారు. గాంధారి మండలంలో కాయితి తండా పంచాయతీ పరిధిలోని ధన్సింగ్ తండాలో రతన్సింగ్ అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో మక్కజొన్న, కంది పంటలో అంతర్గత పంటగా సాగు చేయగా ఈ నెల 3వ తేదీన దాడులు నిర్వహించారు. రతన్ సింగ్ అనే రైతు భూమిలో 267 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. గాంధారి మండలంలో జరిగిన దాడుల్లో రెండు కేసులు నమోదు కాగా ఇద్దరిపై కేసు నమోదైంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు మండలాల పరిధిలో గంజాయి స్మగ్లర్లు దృష్టి పెట్టారు. ముఖ్యంగా జుక్కల్, మద్నూర్ మండలాల్లో గంజాయి సాగవుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ నెల 11న జుక్కల్ మండలంలోని వజ్రకండిలో మక్కజొన్న పంటలో సాగు చేస్తున్న 140 గంజా యి మొక్కలను గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 12వ తేదీన సదాశివ నగర్ మండలంలోని యాచారంలో పత్తి పంటలో సాగవుతున్న 114 గం జాయి మొక్కలను గుర్తించగా, జుక్కల్ మండలంలో 68 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. ఆగస్టు లో బాన్సువాడ మండలంలో సోమ్లానాయక్ తండాలో గం జాయి సాగును గుర్తించారు. పెద్దకొడప్గల్ మండలంలో గంజాయి రవాణా చేస్తున్న మైనర్లను పట్టుకున్నారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గంజాయిసాగు, రవాణాపై ఉక్కుపాదం మోపింది. దీంతో గంజాయి స్మగ్లర్లు పంట సాగును తగ్గించారు. అయితే ఇటీవల కాలంలో మరోసారి గంజాయి సాగు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బిచ్కుంద, మద్నూర్, జుక్క ల్, పెద్ద కొడప్గల్, పిట్లం, గాంధారి, సదాశివనగర్, రా జంపేట తదితర మండలాల్లో ఇటీవల వరుస దాడులు చే యడంతో గంజాయి సాగు వ్యవహారం బయటికి వచ్చిం ది. గంజాయి సాగు పెరుగుతుండడంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు ముమ్మరం చేయడంతో పాటు ఇందుకు కారకులైన వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందుకోసం ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 16 ప్రత్యేక టీముల ద్వారా జిల్లాలో గంజాయి సాగునివారణ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయబోతున్నారు.
గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు
కామారెడ్డి జిల్లా పరిధిలో ఇటీవల వరుస దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశాం. గంజాయి మొక్కలను పెంచినా ఇందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కొంతమంది స్మగ్లర్ల సహకారంతోనే గంజాయి సాగు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. గంజాయి సాగుపై సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. గంజాయి పంట సాగు చేసిన వారితో పాటు భూయజమానులపై కేసులు నమోదు చేస్తాం.