రామారెడ్డి, సెప్టెంబర్ 17: వయ్యారి భామ.. రోడ్ల పక్కన, కాలువ గట్లు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే ఈ కలుపు మొక్క పేరు వింటేనే అటు రైతులు, ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, పశుపోషకులు, సామాన్య ప్రజానీకం సైతం జంకుతుంటారు. ఈ కలుపు మొక్క అన్ని ప్రాంతాల్లో త్వరితగతిన వ్యాపిస్తూ పంట దిగుబడిని తగ్గిస్తుంది. అంతేకాక జంతువులతోపాటు మానవులకూ హానిచేస్తుంది. నిలువె ల్లా విషం కలిగిన వయ్యారిభామ శాస్త్రీయ నామం పార్థీనీయం హిస్టొరోఫోరెస్. ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే రోగాలు వెంటే ఉంటాయని అంటున్నారు వైద్యులు.
ఎలా వచ్చింది..
పంటలకు హాని చేసే ఈ కలుపు మొక్క విత్తనం 1950లో అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి చేసుకున్న గోధుమలతోపాటు ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు చెబుతారు. అతి తక్కువ కాలంలోనే దేశమంతటా విస్తరించింది. వయ్యారిభామ విత్తనాలు 3కి.మీల వరకు గాలిలో విస్తరిస్తాయి. జనావాసాల్లో ఈ మొక్కలు పెరిగితే దోమలు, బొద్దింకలు, ఎలుకలు వృద్ధి చెంది ప్రజలకు వ్యాధులను కలిగిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.
నివారిద్దామిలా..
పంట పొలాల్లో మొలిచిన వయ్యారిభామ పూత పూయక ముందే వేర్లతో సహా తొలగించి బురదలో తొక్కేయ్యాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చరొట్టగా మారుతుంది. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారిభామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. ఈ కలుపు మొక్క పూతదశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఆవిధంగా చేస్తే వయ్యారిభామ కలుపు మొక్కలు మొలవవు.
దిగుబడిని తగ్గిస్తుంది..
వయ్యారిభామ పంట మొ క్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చివేస్తుంది. పూత, పిందెలపై ప్రభావం చూపుతుం ది. దీంతో దిగుబడి తగ్గుతుంది. ఈ మొక్కను సీజన్కు ముందే నియంత్రించాలి. పత్తి, మక్కజొన్న, గోధుమ, మల్బరి, పూల తోటలు, మామిడి, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇతర పంటల మొక్కల శాతం తగ్గిపోవడంతోపాటు ఎదుగుదల మందగిస్తుంది.
మనుషులకు ప్రమాదం..
ఈ మొక్క ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుంది.
పుప్పొడిని పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాపు వస్తాయి.
వయ్యారిభామతో మనుషులకు ప్రమాదకరమైన డర్కాటైటీస్, ఎగ్జిమా హైఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటీస్ వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
దురద, తుమ్ములు వచ్చి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.
పశువులకు ప్రాణసంకటం..
జంతువులకు వెంట్రుకలు వాడిపోవడం, హైపర్ టెన్షన్ పెరుగుతుంది.
సాధారణంగా పశువులు ఈ మొక్కను తినవు. పొరపాటున గడ్డీతోపాటు వయ్యారిభామను తిన్న పశువుల పాలు తాగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది.
వీటిని తిన్న పశువుల జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, అన్నవాహిక శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి మరణిస్తాయి.