ఇందూరు, మే 17: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లా, మండల అధికారులు ప్రతిరోజూ రెండు గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచాలని, కరోనా లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేయాలని సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి పీహెచ్సీ నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్, కరోనా బాధితుల ఓపీ సేవలు, జ్వర సర్వే, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్లోడింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో రెండో దశ జ్వర సర్వే కొనసాగుతున్నదని, సోమవారం 56, 510 ఇండ్లు పూర్తిచేసినట్లు తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలను సేకరించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్స్ అందించి వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. కిట్స్ వాడినా జ్వరం తగ్గకుంటే పీహెచ్సీకి తరలించాలని సూచించారు.ప్రతిరోజు జిల్లా, మండల అధికారులు రెండు గ్రామాలు పర్యటించాలని, వైద్యాధికారులకు ఫోన్ చేయాలని ఆదేశించారు. అర్బన్లో అధికారులు తిరగడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు.
బ్లాక్ ఫంగస్పై జాగ్రత్తగా ఉండాలి
జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులను పరిశీలించాలని, చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండేలా చూడాలన్నారు. దీనిపై అశ్రద్ధ చేయొద్దన్నారు. బ్లాక్ ఫంగస్కు సంబంధించి డాక్టర్ హరీశ్ (9849346227) సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు అన్ని అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీలో కూలీల సంఖ్య మూడు రోజుల్లో పెరిగేలా చూడాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గ్రామానికి, సొసైటీకి కేటాయించిన లారీలు ధాన్యం రవాణా చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. లారీలు రావడం లేదనే మాట ఎక్కడి నుంచీ రావొద్దన్నారు. తహసీల్దార్లు కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ధాన్యం వెంటనే రైస్మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు లత, చంద్రశేఖర్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, డీఆర్డీవో చందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.