రైతులతో వీడియోకాల్లో మాట్లాడిన స్పీకర్ పోచారం
నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని అధికారులకు ఆదేశం
పరిహారం అందేలా చూస్తామని భరోసా
నస్రుల్లాబాద్, ఏప్రిల్ 17: ఇటీవల కురిసిన వడగండ్ల వానతో రైతులు పండించిన పంట నష్టపోవడం బాధాకరమని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి ఆయన మైలారం, నాచుపల్లి గ్రామాల రైతులు, వ్యవసాయాధికారులతో శనివారం వీడియో కాల్లో మాట్లాడారు. నాచుపల్లి సర్పంచ్ వర్షం తో నష్టపోయిన పంటలను తనకు బుధవారం వీడియో కాల్ ద్వారా చూపించారని చెప్పారు. మైలారం, రాములగుట్ట, నస్రుల్లాబాద్, కంశెట్పల్లి, బొమ్మన్దేవ్పల్లి, నాచుపల్లి తదితర గ్రామాల్లో నష్టపోయిన పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని వ్యవసాయాధికారులను స్పీకర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి రైతులకు పరిహారం అందేవిధంగా చూస్తానని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్య పడొద్దని సూచించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరి పరిస్థితి అయితేనే ఇంట్లో నుంచి బయటికి రావాలని సూచించారు.
వీడియోకాల్లో ఇన్చార్జి డీఏవో ఆంజనేయులు, ఏడీఏ చంద్రశేఖర్, విండో చైర్మన్లు పెర్క శ్రీనివాస్, సుధీర్, వైస్ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, ఏవో నరేంద్ర, ఏఈవోలు దత్తేశ్వరి, ప్రతాప్, నాయకులు మంగలి సాయిలు, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.