కామారెడ్డి /విద్యానగర్, సెప్టెంబర్ 16 : పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని లింగాపూర్ శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెలో కేసీఅర్ ఉంటారన్నారు. పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని.. మూడు నెలలకోసారి మండల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓ వైపు ప్రధాని మోదీ అభినందిస్తుంటే .. ఆ పార్టీ నేత బండి సంజయ్ విమర్శలు చేయడం హస్యాస్పదమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఊరూరా పాదయాత్ర చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేసీఅర్ పాలనను ప్రధాని మోదీ ఎన్నోసార్లు మెచ్చుకున్నాడన్నారు. ఒకవైపు సంజయ్.. మరోవైపు రేవంత్రెడ్డి అసత్యపు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కులాలు, మతాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరున్నరేండ్లలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఅర్ విసిరిన సవాల్ను ఇప్పటి వరకు స్వీకరించలేదన్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి సైతం మన రాష్ట్రంలో పథకాలను చూసి ప్రశంసించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 56 ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ పింఛన్లు వంటి పథకాలు అమలు చేయడం లేదన్నారు. పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్ఎస్లో ప్రస్తుతం 60లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలు
ప్రతిపక్ష నాయకులు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ జడ్పీ చైర్మన్, కామారెడ్డి జిల్లా ఇన్చార్జి దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో 99 గ్రామాలకు అన్నీ ఏకగ్రీవం కావడం హర్షణీయమన్నారు. సభ్యత్వ నమోదులో సాధారణం 32,500, క్రియాశీల 17,750 సభ్యత్వాలు తీసుకొని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అన్నారు. అనంతరం నూతన మండల అధ్యక్షులను ప్రకటించి వారిని సన్మానించారు. విప్ గంపగోవర్ధన్ను తల్వార్, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల అధ్యక్షులు వీరే..
కామారెడ్డి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా జూకంటి ప్రభాకర్రెడ్డి, రాజంపేట్ మండల అధ్యక్షుడిగా దిక్కాజి బలవంత్రావు, భిక్కనూర్అధ్యక్షుడిగా పెద్ద బచ్చగారి నర్సింహారెడ్డి, దోమకొండ అధ్యక్షుడిగా గండ్ర మధుసూదన్రావు, బీబీపేట్ అధ్యక్షుడిగా చల్లాపురం వెంకట్ గౌడ్, మాచారెడ్డి మండల అధ్యక్షుడిగా వడ్ల బాల్ చంద్రంను విప్ గంపగోవర్ధన్ ప్రకటించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.