నస్రుల్లాబాద్, మార్చి 16 : పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో పచ్చదనం పరిఢవిల్లేలా ప్రభుత్వం ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేజ్పార్క్ ఆదర్శంగా నిలుస్తున్నది. రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు వచ్చి సేద తీరుతున్నారు. ప్రకృతి వనం కోసం ఎంపిక చేసిన స్థలంలో బౌండరీ వద్ద మూడు వరుసల్లో మొక్కలను నాటారు. ఈ పార్కులో వేప, గుల్మొహర్, రెయిన్ ట్రీ, రావి, కానుగ, పెల్టోఫోరమ్, బాదాం, గన్నేరు, టెకోమా, బోగన్విలా, మందారతోపాటు ఈత, హెన్నా, సీతాఫలం, దానిమ్మ, జామ, కరివేపాకు, మల్బరీ, వెదురు, జమ్మి తదితర మొక్కలను ఈ ప్రకృతి వనంలో నాటి సంరక్షిస్తున్నారు. ప్రకృతి వనంతో గ్రామం పచ్చని హారంగా మారడంతోపాటు ప్రజలు సేద తీరడానికి ఉపయోగపడుతున్నది. వాకింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.