నిజాంసాగర్, మే 15 : మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా లాక్డౌన్తో గ్రామాల్లో పనులు లేక ఖాళీగా ఉంటున్న కూలీలకు ఉపాధి హామీ పనులు వరంగా మారాయి. గ్రామాల్లో వ్యవసాయ పనులు పూర్తయి ఇంటి వద్ద ఎలాంటి పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పనుల్లో కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. చెరువులు, కుంటల్లో పూడికతీత పనులతోపాటు అటవీ ప్రాంతాల్లో కందకాలు తవ్వే పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షిస్తున్నారు. కూలీల హాజరును మస్టర్లలో నమోదు చేసుకుంటున్నారు. ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు.
ఉపాధి హామీ పనుల పరిశీలన
బిచ్కుంద, మే 15: మండలంలోని పుల్కల్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఆనంద్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం వేసవిలో బోనస్ ఇస్తున్నదని తెలిపారు. 70 శాతం పనులు నిర్వహిస్తే 30 శాతం అదనపు కూలి అందజేస్తున్నదని తెలిపారు. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏపీవో భిక్షపతి పాల్గొన్నారు.