కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 14: జిల్లాలోని ఐదు గ్రామాల్లో ప్రతినెలా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో వీడియాకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శుక్రవారం వాటరింగ్ డే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ మాట్లాడుతూ.. గ్రామాల్లో కంపోస్ట్ షెడ్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. సేంద్రియ ఎరువులను విక్రయించి పంచాయతీలు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ఉపాధి హామీలో 20 మంది కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలశక్తి అభియాన్ ద్వారా గ్రామాల్లో ఊట చెరువులు, చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టాలని సూచించారు. శ్రమశక్తి సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులను గుర్తించాలన్నారు. గ్రీన్ బడ్జెట్ను వినియోగించి అన్ని రోడ్లలో మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, డీపీవో సునంద, డీఎల్పీవోలు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.