ఎల్లారెడ్డి రూరల్, మే 14 : రైతులకు సబ్సిడీపై ఇవ్వడానికి పచ్చిరొట్ట ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు అన్నారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ వద్ద, మత్తమాల సొసైటీ వద్ద సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాల పంపిణీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి గాటాడి సంతోష్కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగలను 65 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మండలానికి 835 బస్తాల జీలుగ, 125 బస్తాల జనుము వచ్చినట్లు ఆయన తెలిపారు. 30 కిలోల జీలుగ సంచి ధర రూ. 1,605 కాగా సబ్సిడీపై రూ.561.75కు, 40 కిలోల జనుము బస్తా ధర రూ.2654.40 కాగా రాయితీపై రూ.929.04కు ఇస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవీ బాల్రాజ్గౌడ్, జడ్పీటీసీ ఊషాగౌడ్, సొసైటీ డైరెక్టర్లు, వ్యవసాయ విస్తీర్ణాధికారి రవీందర్, ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం, రైతులు పాల్గొన్నారు.