ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న కొవిడ్ వైరస్
కామారెడ్డి జిల్లాలో 676, నిజామాబాద్ జిల్లాలో 201 మందికి కరోనా పాజిటివ్
కామారెడ్డి జిల్లాలో ఇద్దరి మృతి
విద్యానగర్/ఖలీల్వాడి: ఏప్రిల్ 14: కరోనా మహమ్మారి ఉమ్మడి జిల్లాలో జోరుగా వ్యాప్తి చెందుతున్నది. రోజురోజుకూ తన ప్రభావాన్ని చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ఒక్కరోజే 877 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 2,851 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 676 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 17,611 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో విద్యానగర్కు చెందిన 68 ఏండ్ల ఓ వృద్ధురాలు, మాచారెడ్డి మండలానికి చెందిన 45 ఏండ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో 210 మందికి కరోనా సోకిందని జిల్లావైద్యాధికారి బాల నరేంద్ర తెలిపారు. ఇప్పటివరకు 22428 మంది కొవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటికి రావాలని సూచిస్తున్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
కామారెడ్డి జిల్లాలోని 30 కేంద్రాల్లో 4,586 మందికి కొవిడ్ టీకాలను వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 93,228 మంది కరోనా టీకా తీసుకున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 6,699 మందికి టీకా వేసినట్లు డీఎంహెచ్వో బాలనరేంద్ర తెలిపారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.