బాన్సువాడ రూరల్, మే 13 : నెల రోజలు పాటు భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిములు గురువారం రాత్రి నెలవంక కనిపించడంతో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిములు షవ్వాల్ మాసం మొదటి రోజు రంజాన్ ఈద్ జరుపుకుంటారు. ముస్లిములకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. పండుగ రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి నూతన వస్ర్తాలు ధరించి అత్తర్ పూసుకుని పిల్లాపాపలతో ఈద్గాలకు వెళ్తారు. ప్రత్యేక ప్రార్థనలు, మత పెద్దల ప్రవచనాల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. కానీ ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మతపెద్దల సూచనల మేరకు కుటుంబ సభ్యులతో ఇంటి వద్దే ప్రార్థనలు చేసి పండుగను జరుపుకునేందుకు ముస్లిములు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిములకు రంజాన్ తోఫాలను అందించింది.
పవిత్రమైన పండుగ..
కరోనా నిబంధనలను పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లిములు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ప్రార్థనల అనంతరం జకాత్, ఫిత్రా పేరిట దానధర్మాలు చేస్తారు. ప్రతి పేదవాడు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో స్థితిమంతులు, స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు దుస్తులు, పండుగ సామగ్రి, నగదు అందజేస్తారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్లుగా నిరుపేదలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో రంజాన్ తోఫాను కానుకగా అందిస్తున్నది.
జకాత్లు (ధర్మాలు) తప్పని సరి..
రంజాన్ పర్వదినం రోజున తప్పని సరిగా తమ ఆదాయంలోంచి ఎంతో కొంత నిరుపేదలకు జకాత్(దానం) చేస్తుంటారు. జకాత్ గురించి ఖరాన్లో 30 అధ్యాయాల్లో వివరించడం జరిగింది. జకాత్ అనగా వ్యక్తి తాను సంపాదించిన ఆదాయం ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా తన ఆదాయంలో నుంచి కొంత నిరుపేదలకు కచ్చితంగా దాన ధర్మాలు చేయాలని, అది పేదల హక్కు అని ఖరాన్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నెల రోజుల పాటు కఠిన ఉపవాసదీక్షలు చేపట్టిన ముస్లిములు పండుగ కంటే ముందుగానే పేదలకు తప్పని సరిగా దానధర్మాలు చేస్తుంటారు.
ఫిత్రాకు ప్రాధాన్యం..
కోటగిరి, మే 13 : రంజాన్ వేడుకల్లో ‘ఫిత్రా’కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండుగకు రెండు, మూడు రోజుల ముందుగానే పేదలకు దానం ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నది. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలనేదే ఫిత్రా ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది ఫిత్రా రూ.70గా నిర్ణయించారు. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు, పేదలకు ఈ ఫిత్రా అందిస్తే.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల్లో జరిగే పొరపాట్లు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. ఫిత్రా దానం అంటే రంజాన్ ఉపవాసాలను పూర్తి చేసిన సందర్భంగా పేదలకు ఇవ్వాల్సిన తప్పనిసరి దానం.
ముస్లిములకు ప్రముఖుల పండుగ శుభాకాంక్షలు
ముస్లిములకు రంజాన్ సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున ఇండ్లలోనే వేడుకలను జరుపుకోవాలని, ప్రజలంతా బాగుండాలని ప్రార్థించాలని కోరారు.
ఇందూరు, మే 13: రంజాన్ పండుగ సందర్భంగా రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపా రు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పండుగను కు టుంబ సభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని, ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఇంట్లోనే నిర్వహించుకోవాలని కోరారు.
కామారెడ్డి, మే 13 : పవిత్రతకు, త్యాగానికి చిహ్నమైన రంజాన్ పండుగను ముస్లిములు భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్ ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజామాబాద్ సిటీ, మే 13: నిజామాబాద్ జిల్లాపరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ముస్లిములకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ ఆనందంగా జరుపుకోవాలని, సుఖ శాంతులు మీ ఇంట నిత్యం ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.