కామారెడ్డి టౌన్, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్డీవోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పోలీస్ ఎస్హెచ్వోలు, మెడికల్ ఆఫీసర్లు, సీడీపీవోలు, వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడంపై సమీక్షించారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి పేర్లు, ఫోన్ నంబర్లు జిల్లా కేంద్రంలోని కరోనా కంట్రోల్ రూమ్కు అందజేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ అధికారులు కరోనా బాధితులకు ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి, మందులు సక్రమంగా వాడుతున్నారా? లేదా? హోం ఐసోలేషన్లో ఉన్నారా? అనే అంశాలను తెలుసుకుంటారని చెప్పారు. ఇంట్లో వసతి లేని వారిని ప్రభుత్వ కొవిడ్ సెంటర్కు తరలించాలని సూచించారు. ఉద్యోగులకు ప్రైవేట్ సంస్థలు లాక్డౌన్ సమయంలో వేతనాలు కోత లేకుండా అందజేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను మూసి ఉంచాలని సూచించారు. గర్భిణులు, బాలింతల ఇండ్లకు వెళ్లి సరుకులు అందజేయాలన్నారు. లాక్డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. మండలస్థాయి, మున్సిపల్ అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ అజయ్కుమార్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి అనురాధ, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.