విద్యానగర్/ఇందూరు, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఏడాది కరో నా విజృంభించడంతో పదోతరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేసింది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో 2020-21 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు సమర్పించిన వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 23 వరకు భౌతికంగా తరగతులు నిర్వహించారు. కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్చి 24 నుంచి పాఠశాలల్లో తరగతుల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి కరోనా రెండో వేవ్ విజృంభించడంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ద్వారా విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరూ పాస్ అయ్యారు.
గ్రేడింగ్ ఆధారంగా..
ఫిబ్రవరిలో నిర్వహించిన ఎఫ్ఏ-1లో వచ్చిన మార్కు ల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నారు. గ్రేడింగ్లో 20 మార్కులను 100గా లెక్కిస్తారు. ఎఫ్ఏ-1లో 18-20 మార్కులు వస్తే 91 నుంచి 100 మార్కులు కేటాయించి ఏ-1 గ్రేడ్, 16-17 వస్తే 81 నుంచి 90 మార్కులు కేటాయించి ఏ-2 గ్రేడ్, 14-15 వస్తే 71 నుంచి 80 మార్కులు కేటాయించి బీ-1 గ్రేడ్,12-13 వస్తే 61 నుంచి 70 మార్కులు కేటాయించి బీ-2 గ్రేడ్, 10-11 వస్తే 51 నుంచి 60 మార్కులు కేటాయించి సీ-1 గ్రేడ్, 8-9 వస్తే 41 నుంచి 50 మార్కులు కేటాయించి సీ-2 గ్రేడ్, 7 వస్తే 35 నుంచి 40 మార్కులు కేటాయించి డీ-1 గ్రేడ్, 0-6 వస్తే 00 నుంచి 34 మార్కులు కేటాయించి డీ-2 గ్రేడ్లుగా నిర్ధారిస్తారు. ఏ-1 గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు జీపీఏ 10గా నిర్ధారిస్తారు. పాస్ అయిన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ త్వరలోనే గ్రేడ్లు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నది.
కామారెడ్డి జిల్లాలో 12,835 మంది..
కామారెడ్డి జిల్లాలో మొత్తం 12,835 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కానున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మైనారిటీ వెల్ఫేర్ 92, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 7,676, ప్రైవేట్, ఎయిడెడ్లో 28, ఓరియంటల్ 22, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 2,445, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 370, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు 579, సొసైటీ పాఠశాలల విద్యార్థులు 774, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల విద్యార్థులు 60, గురుకులాల విద్యార్థులు 44 మంది ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలో మొత్తం 522 పాఠశాలల్లో బాలురు 11841, బాలికలు 11198, మొత్తం 23,039 మంది పదో తరగతి చదువుతున్నారు. పది ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొం ది. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పరీక్షలు రద్దు చేయడం మంచి నిర్ణయమని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని..
కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఎఫ్ఏ- 1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరవడంతో కొంతమంది ఉపాధ్యాయులు చనిపోయారు. పరీక్షలు లేకపోవడంతో బాగా చదివే విద్యార్థులకు కొంత నష్టం వాటిల్లినా ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం.
ఎన్వి.దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్
గ్రేడింగ్ ద్వారా పాస్…
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ పదోతరగతి విద్యార్థులను గ్రేడింగ్ ద్వారా పాస్ చేసింది. జిల్లా వ్యాప్తంగా 12,835 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. త్వరలోనే విద్యార్థుల గ్రేడ్లను ప్రభుత్వ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
-రాజు, డీఈవో