బాన్సువాడ/ బీర్కూర్/పిట్లం, మే 12: ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించే నర్సులు సేవామూర్తులని బాన్సువాడ ప్రాంతీయ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్ కొనియాడారు. బాన్సువాడ దవాఖానలో నర్సుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో విధులు నిర్వహించే నర్సులతో నర్సింగ్ సూపరింటెండెంట్ కృష్ణవేణి నైటింగెల్ ప్రేయర్ చేయించారు. అనంతరం సమాజంలో నర్సుల పాత్ర, వారి గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా దవాఖానలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెడ్ నర్సు అమృతమ్మ, స్రవంతి, సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక దవాఖానలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తిలకేశ్వరి రఘు మాట్లాడుతూ దేవుడి తర్వాత రెండో దేవుడిగా పిలిచేది డాక్టర్లనేనని, వారికి ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించే నర్సుల సేవలు కూడా వెలకట్టలేనివని అన్నారు. కరోనా సమయంలో నర్సులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడారని అన్నారు. రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అవారి గంగారాం, డాక్టర్ రత్నం, అన్నారం సర్పంచ్ మునిగె కిష్టారెడ్డి లయన్స్ ప్రతినిధులు హన్మాండ్లు గుప్తా, మేకల విఠల్, రషీద్, భూమయ్య గుప్తా పాల్గొన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రజిని నర్సులను సన్మానించారు. సంవత్సరం నుంచి కొవిడ్ను సైతం లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారి సేవలను గుర్తించి సన్మానించామన్నారు. కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ అనిత, సభ్యులు సంజీవ్రెడ్డి, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, వైద్యాధికారులు శివకుమార్, రోహిత్కుమార్ పాల్గొన్నారు.