ఎల్లారెడ్డి రూరల్, మే 11: ఉపాధిహామీతో పేద కుటుబాలకు ఆర్థికంగా అండగా నిలిచినవారమవుతామని ఎంపీ పీ కర్రె మాధవీ బాల్రాజ్గౌడ్ అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో మంగళవారం ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఉపాధి కూలీలకు పనిపై అవగాహన కల్పించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బయట పని దొరికే అవకాశం లేదని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జాబ్కార్డుల సంఖ్యను పెంచి ప్రతి ఒక్కరూ పనులకు వెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. గ్రామస్తులు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో అతినారపు ప్రకాశ్, పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలి
ఎల్లారెడ్డికొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉపాధి పనులు జరిగేలా చూడాలని డీఎల్పీవో రాజేంద్రప్రసాద్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీల సం ఖ్య పెంచుతూనే గుర్తించిన ఈజీఎస్ పనులను పూర్తి చేయాలన్నారు. కూలీలందరూ మాస్కులు ధరించేలా చూడాలని, పని వద్ద కూలీలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది చేసిన ఇంటింటా జ్వర సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులు ఇచ్చామని, ఐదు రోజుల అనంతరం వారి పరిస్థితి మెరుగుకాకపోతే క్వారంటైన్ సెంటర్కు తరలించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో తహసీల్దార్ సముద్రాల స్వామి, ఎంపీవో అతినారపు ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
జోరుగా ఉపాధి పనులు
గాంధారి, మే 11: మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. మండల కేంద్రంలోని పోచమ్మ రేవు నుంచి లింగంపేట్ రోడ్డు వరకు గల పానాది దారిపై గుంతలు పూడ్చివేశారు. దారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తొలగించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి పనులను పంచాయతీ అధికారి మల్లేశ్ పరిశీలించారు. కూలీలు కొవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేపట్టాలని సూచించారు.
తాడ్వాయి మండలంలో..
తాడ్వాయి, మే 11: మండల పరిధిలోని గ్రామాల్లో మంగళవారం ఉపాధిహామీ పనులు కొనసాగాయని ఏపీవో శ్రీనివాస్ తెలిపారు. చెరువుల్లో పూడికతీత, ఫార్మేషన్ రోడ్ల నిర్మాణం, వ్యవసాయ భూముల్లో రాళ్లు తొలగించే పనులు కొనసాగుతున్నాయన్నారు. కార్యదర్శులు, టీఏలు కొత్తగా పనులను గుర్తించి కూలీలందరికీ ఉపాధి కల్పించాలని కోరారు.
పంట కాలువల్లో పూడికతీత పనులు
నిజాంసాగర్, మే11: మండలంలోని గున్కుల్ గ్రామ శివారులో పంట కాలువలో పూడికతీత పనులను మంగళవారం ఏఈ శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి ఏడో నంబర్ డిస్ట్రిబ్యూటరీ వరకు ఉన్న పంట కాలువల్లో పూడికతోపాటు పిచ్చిమొక్కల తొలగింపు పనులను ఉపాధి హామీ కూలీలతో చేపట్టామన్నారు. పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు సాగు నీటి ఇబ్బందులు దూరమవుతాయని అన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రవి ఉన్నారు.
పనుల పరిశీలన..
పిట్లం, మే 11: ఉపాధిహామీ పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంపీవో బ్రహ్మం అన్నారు. మద్దెలచెరువులో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి పనులను ఎంపిక చేసి పనులు కొనసాగించాలని పేర్కొన్నారు. ఆయన వెంట సర్పంచ్ పండిత్రావ్, పంచాయతీ కార్యదర్శి అజ్మీరాబేగం, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.
మాచారెడ్డి మండలంలో..
మాచారెడ్డి, మే 11 : మండల కేంద్రంతోపాటు అక్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను ఎంపీడీవో బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. అక్కాపూర్ గ్రామంలో ట్రెంచ్ పనులను, మాచారెడ్డిలో నర్సరీ పనులను పరిశీలించారు.
కొలతల ప్రకారం పనులు చేయాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని ఉపాధి కూలీలకు సూచించారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.