బీర్కూర్/రామారెడ్డి, మే 11: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాతే రైతుల బతుకులు బాగుపడ్డాయని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటున్నదని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని, ప్రతి ధాన్యంగింజనూ కొనుగోలు చేస్తామన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్కుమార్, నాయకులు హన్మాండ్లుగుప్తా, నారం వెంకటి తదితరులు పాల్గొన్నారు.
రైతులు అధైర్యపడొద్దు
రామారెడ్డి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇసన్నపల్లి, రామారెడ్డి, ఉప్పల్వాయి తదితర గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే సురేందర్ హామీతో రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, నిరాశకు గురికావొద్దన్నారు. ఆయన వెంట రైతుబంధు సమితి రామారెడ్డి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మాగౌడ్, సీఈవో కడెం భైరయ్య, నవీన్ తదితరులు ఉన్నారు.