బాన్సువాడ రూరల్/పిట్లం/ఎల్లారెడ్డి/లింగంపేట/ తాడ్వాయి , మే 10: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. జ్వరం, దగ్గు, జలుబు వంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని వైద్య బృందాలు గుర్తించి మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని 25 గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. పంచాయతీ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు బృందాలుగా ఏర్పడి సోమవారం ఇంటింటికీ తిరుగుతూ జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి అక్కడే కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్ను అందజేశారు. పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు. పిట్లం మండలంలోని అన్నారంలో సోమవారం సర్పంచ్ కాశీరాం, వైద్య బృందం తో కలిసి ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి వారి ఆరోగ్య స్థితిగతులను తెలియజేయాలన్నారు.
ప్రజలందరూ కరోనాతో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో వైద్య సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 1వ వార్డులో వైద్య సిబ్బంది, వార్డు కౌన్సిలర్తో కలిసి సర్వే నిర్వహించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లను అందజేశారు. ఐదు రోజుల అనంతరం సమస్యలు తగ్గనివారిని దవాఖానలకు తరలించి, పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో మత్తమాల వైద్య సిబ్బందితోపాటు వార్డు కౌన్సిలర్ అల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు. లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సమీనా తెలిపారు. గ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని సర్వేలో గుర్తిస్తున్నామన్నారు.
జ్వరం వచ్చిన వారు కొవిడ్ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా మందులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జలుబు, దగ్గు ఉన్న వారు హోం ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తున్నట్లు తెలిపారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. తాడ్వాయి మండల పరిధిలోని గ్రామాల్లో సోమవారం వైద్య సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారని వైద్యాధికారి తెలిపారు. ఏఎన్ఎం, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏలు కలిసి ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరమైతే పరీక్షలకు ఎర్రాపహాడ్ పీహెచ్సీకీ తీసువస్తున్నారని తెలిపారు. వైద్య బృందం సభ్యులకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.
హోం ఐసొలేషన్ కుటుంబాలకు అవగాహన..
నాగిరెడ్డిపేట్, మే 10: మండలంలోని జలాల్పూర్లో హోం ఐసొలేషన్లో ఉన్న వారితో మెడికల్ ఆఫీసర్ నందిత మాట్లాడారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాధితులకు అవగాహన కల్పించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట సర్పంచ్ కృష్ణ ఉన్నారు.