గోదాముల నిర్మాణంతో తీరిన కష్టాలు
లింగంపేట, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వ్యవసాయం దండగ కాదు పండుగలా మారింది. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడమే కాకుండా పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. గ్రామాల్లోనే పంట దిగుబడిని కొనుగోలు చేస్తూ అన్నదాతకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎక్కడిక్కడే గోదాములను నిర్మిస్తున్నది. మండలంలోని 16 పంచాయతీల పరిధిలోని ఆయా గ్రామాల్లో 10కి పైగా గోదాములను నిర్మించారు. రైతుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నది.
మండలంలోని నల్లమడుగు, లింగంపేట, శెట్పల్లిసంగారెడ్డి గ్రామాల్లోని సహకార సంఘాల ఆధ్వర్యంలో గోదాములను నిర్మించారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. ఎరువుల కోసం నిత్యం ఆందోళనలు చేసేవారు. ప్రస్తుతం నిర్మించిన గోదాముల్లో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతూ సకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తున్నారు. నల్లమడుగు సహకార సంఘం ఆధ్వర్యంలో నల్లమడుగు, కోర్పోల్, బాణాపూర్, శెట్పల్లిసంగారెడ్డి సహకార సంఘం పరిధిలో పోల్కంపేట, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో గోదాముల నిర్మాణాలు చేపట్టారు. లింగంపేట సహకార సంఘం పరిధిలోని భవానీపేట, ఐలాపూర్, పోతాయిపల్లి, శెట్పల్లి, లింగంపేట, బోనాల్ గ్రామాల్లో గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టారు.