ఆహ్లాదకరంగా ప్రకృతి వనం
ఆకట్టుకుంటున్న అవెన్యూ ప్లాంటేషన్
గాంధారి, మే 9:
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అనడానికి గాంధారి మండలంలోని గౌరారమే నిదర్శనం. గ్రామ సమీపంలో నిర్మించిన వైకుంఠధామంతోపాటు కంపోస్ట్ షెడ్డు పనులు, పల్లె ప్రకృతి వనాన్ని సకాలంలో పూర్తి చేశారు. కోతుల బెడద నివారణ కోసం గ్రామ శివారులో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి రకరకాల పండ్ల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో రోజూ పారిశుద్ధ్య పనులు చేపడుతూ వీధులను శుభ్రంగా ఉంచుతున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి కంపోస్ట్ షెడ్డుకు తరలించి ఎరువును తయారు చేస్తున్నారు. గ్రామానికి వచ్చే రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి దారి వెంట వచ్చే వారికి నీడనిస్తున్నాయి. విలేజ్ నర్సరీలో రకరకాల మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా జీపీ ట్యాంకర్ సహాయంతో నీరు పోస్తూ కాపాడుతున్నారు. ఇటీవల మంజూరైన నిధులతో గ్రామంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లతోపాటు మురికి కాలువలను నిర్మించారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారి నుంచి గౌరారం గ్రామా నికి వెళ్లే దారికి ఇరువైపులా దాదాపు కిలోమీటరు మేరకు అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టగా మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి.
భావితరాలు గుర్తుంచుకునేలా..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో భావి తరాల వారు గుర్తుంచుకునేలా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్లను సకాలంలో పూర్తి చేశాం. గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి పనులను విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. హరితహారం మొక్కలకు రోజూ నీరు పోసి సంరక్షిస్తున్నాం. -మలిపెద్ది అంజయ్య, సర్పంచ్