పిట్లం/ బీర్కూర్/ బిచ్కుంద/ గాంధారి/ రామారెడ్డి/ తాడ్వాయి/ మద్నూర్/ సదాశివనగర్, ఏప్రిల్ 8 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 45 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలను గురువారం వేశారు.
పిట్లం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి శివకుమార్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 60 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 12 మందికి పాజిజివ్ వచ్చినట్లు తెలిపారు. నస్రుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. సంగెం గ్రామానికి చెందిన 12 మందికి, నస్రుల్లాబాద్లో ఐదుగురికి, బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్లో ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. ఉమ్మడి బీర్కూర్ మండలంలో 136 మంది ఐసొలేషన్ వార్డులో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వాల్, వైద్య సిబ్బంది విఠల్, రాహుల్ పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 115 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఎంపీపీ అశోక్ పటేల్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
గాంధారి మండలకేంద్రంతోపాటు ఉత్తునూర్ పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 122 మందికి టెస్టులు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు హరికృష్ణ తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారం ప్రభుత్వ దవాఖానలో 58 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ రాము తెలిపారు. దవాఖానలో 167 మందికి టీకాలు వేశామని చెప్పారు. కార్యక్రమంలో ల్యాబ్టెక్నీషియన్ శంకర్, ఏఎన్ఎంలు పద్మ, సుమలత, రాణి, మమత పాల్గొన్నారు. రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 103 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. 85 మందికి కొవిడ్ టీకా వేసినట్లు పేర్కొన్నారు.
తాడ్వాయి మండలపరిధిలోని ఎర్రాపహాడ్ పీహెచ్సీలో 106 మందికి టెస్టులు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. తాడ్వాయికి చెందిన ఐదుగురికి, ఎండ్రియాల్కు చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. తాడ్వాయిలో ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులకు పాజిటివ్ వచ్చిందని, వీరు హైదరాబాద్కు చెందిన వారని చెప్పారు. దవాఖానలో 120 మందికి టీకాలు ఇచ్చినట్లు వివరించారు.
మద్నూర్ మండలంలోని డోంగ్లి పీహెచ్సీలో 151 మందికి టెస్టులు నిర్వహించగా.. 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో చిన్నఎక్లారా గ్రామస్తులు 48 మంది, డోంగ్లి గ్రామస్తులు 10 మంది ఉన్నారని వైద్యుడు అశ్విన్ బాబు తెలిపారు. మద్నూర్ సీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా… 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 212 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి.. 27 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశామని, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వివరించారు.
సదాశివనగర్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 167 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు డాక్టర్ ఇద్రిస్ ఘోరీ తెలిపారు. వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
గొల్లపల్లిలో నేడు కరోనా పరీక్షల శిబిరం..
రామారెడ్డి, ఏప్రిల్ 8 : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం కరోనా పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ షాహిద్అలీ తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, 45 ఏండ్లు దాటిన వారు కొవిడ్ టీకాలు వేయించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఎన్ఎంలు మహేశ్వరి, లలిత ఉన్నారు.
బాన్సువాడ లో 38 కరోనా పాజిటివ్ కేసులు
బాన్సువాడ డివిజన్కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 88 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వివిధ ప్రాంతాలకు చెందిన 38 మందికి పాజిటివ్ వచ్చినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్ తెలిపారు. పట్టణానికి చెందిన వ్యాపారి సైతం కరోనాతో ఇటీవల మృతిచెందారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ కూడా చదవండీ…
సీరంకు ఆస్ట్రాజెనిక్ షాక్: టీకా తయారీలో జాప్యమేంటని నిలదీత