స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బీర్కూర్, జూన్ 7 : వానకాలంలో సాగుకు సిద్ధమవుతున్న రైతులు జూన్ నెలలోనే వరినాట్లు వేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండల ప్రజాప్రతినిధు లు, నాయకులు, అధికారులతో సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియోకాల్ ద్వారా మాట్లాడి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. బాన్సువాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితోపాటు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడు తూ వానకాలం పంటల సాగుకు సిద్ధం కావాలని సూచించారు. జూన్ నెలలో నాట్లు పూర్తిచేస్తే నవంబర్లో వచ్చే తుపాన్ల నుంచి పంటలను కాపాడుకోగలుగుతామని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రించేందుకు కొనసాగుతున్న లాక్డౌన్ అమలుతీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్ అమలుతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కరోనా కట్టడి చర్యలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
సమావేశానికి ముందు ఇటీవల అనారోగ్యం తో మరణించిన దామరంచ సర్పంచ్ అంబయ్య కు నివాళులు అర్పించి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, వైస్ ఎంపీపీ కాశీరాం, కో-ఆప్షన్ సభ్యుడు ఆరీఫ్, నాయకులు ద్రోణవల్లి సతీశ్, మద్దినేని నాగేశ్వర్రావు, అవారి గంగారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, అధికారులు పాల్గొన్నారు.