నేడు మృగశిర కార్తె
చేపలకు యమ డిమాండ్
తొలకరితో పులకరించనున్న పుడమి
సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు వాతావరణంలో మార్పులు..
బాన్సువాడ రూరల్, జూన్ 7: మృగశిర కార్తె ఆరంభం కాగానే వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఆకాశం మబ్బులతో కూడుకొని గాలిలో తేమశాతం పెరుగుతుంది. రోహిణి కార్తె వరకు వేసవి తాపంతో అల్లాడిపోయిన ప్రజలకు మృగశిర కార్తె ఉపశమనం కలిగిస్తుంది. ఎండలు తగ్గిపోయి వర్షాలు మొదలవుతాయి. నైరుతి రుతుపవనాలు రాష్ర్టాన్ని తాకి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి జిల్లాలో తొలకరి వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పొలాల్లో వేయనున్నారు. మృగశిర కార్తెలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సాగు చేసిన పంటలు తెగుళ్లు, చీడపీడల బారినపడకుండా అధిక దిగుబడి వస్తుందని వారి నమ్మకం.
వంటకాల ప్రత్యేకం..
మృగశిర కార్తె ప్రారంభం రోజు వండే వంటకాలకు ప్రత్యేకత ఉంటుంది. కురిసే తొలకరి వర్షాలతో వాతావరణం చల్లబడి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండడానికి చేపలను తింటారు. మృగశిర కార్తె చేపలు తినడం అనాదీగా వస్తున్నది. దీంతో గుండెజబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేగాకుండా వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే.
దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వానకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. మామిడిపండ్ల రసంతోపాటు అట్లు వేసుకొని తింటారు.
మృగశిర కార్త్తె (మిరుగు)వచ్చిందంటే సకల జనులకు ఊరట కలుగుతుంది. వర్షాలకు నాంది పలికే మృగశిర కార్తె మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఎండలతో సతమతమవుతున్న సర్వకోటి జీవులకు ఈ కార్తె ఉపశమనం కలిగిస్తుంది. రుతుపవనాల ఆగమనంతో కార్తె ప్రారంభాన్ని రైతులు ఏరువాక సాగే కాలమని చెబుతారు. జిల్లాలోని రైతులు దుక్కులు దున్ని వానకాలం పంటల సాగుకు సిద్ధమయ్యారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని మార్కెట్లన్నీ చేపలతో కళకళలాడుతున్నాయి.