నిజాంసాగర్ ఆయకట్టుకు ఢోకా లేదు
అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
ప్రజా ప్రతినిధులతో వీసీలో స్పీకర్
బాన్సువాడ, జూన్ 6: నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నిర్భయంగా పంటలు వేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బాన్సువాడ పట్టణ, మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులతో ఆయన హైదరాబాద్ నుంచి మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, రైతులకు న్యాయం చేస్తున్న సీఎం కేవలం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. గ్రామాల్లో స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో చేపట్టే పనులపై చర్చించారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులు సకాలంలో పంటలు వేసుకోవాలని సూచించారు. వర్ని మండలం సిద్ధాపూర్లో రిజర్వాయర్ నిర్మాణం కోసం తాను సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు.
సిద్ధాపూర్ రిజర్వాయర్ ఎత్తు పెంచేందుకు త్వరగలో రూ.78.80కోట్లు మంజూరవుతాయని, దీంతో 9,750 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. లాక్డౌన్ అనంతరం తాను గ్రామాలన్నింటినీ సందర్శిస్తానని, తాగునీటి సమస్య ఉన్నట్లు తేలితే ఆ గ్రామ సర్పంచ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీసీలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్రెడ్డి, బల్దియా చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, విండో చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్గౌడ్, నాయకుడు ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.