డీజీపీ మహేందర్రెడ్డి
కామారెడ్డి టౌన్, జూన్ 5: ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జిల్లా పోలీసు భవనాలను నిర్మించిందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. కామారెడ్డిలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జిల్లా పోలీసు నూతన భవనాన్ని ఆయన వెస్ట్ జోన్ ఐజీ ఎం.స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ రేంజ్ ఐజీ ఎన్.శివశంకర్రెడ్డి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్కుమార్ జైన్, చీఫ్ ఇంజినీర్ విజయ్కుమార్తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు పోలీసు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను ప్రశాంతంగా ఉన్నతాధికారులకు వివరించే వీలు ఉంటుందని చెప్పారు. భవనంలో అన్ని వసతులు కల్పించారని పేర్కొన్నారు. మిగిలిన చిన్నచిన్న పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.