విద్యానగర్/బీబీపేట్/బాన్సువాడ/లింగంపేట/నాగిరెడ్డి పేట/గాంధారి/ఎల్లారెడ్డి రూరల్, జూన్ 4: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ను అధికారులు పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ప్రజలు రోడ్లపై అనవ సరంగా తిరుగ కుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. లాక్డౌన్ సయమం ప్రారంభం కాగానే మధ్నాహ్నం 2 గంటల తర్వాత చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. కాగా, సడలింపు సమయంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోడ్లపై సందడి కనిపిస్తున్నది.
బీబీపేట్ మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని ఎస్సై మహేందర్ హెచ్చరించారు.
బాన్సువా డ పట్టణంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఐ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనవసరంగా బయటికి వచ్చేవారికి జరిమానా విధిస్తున్నారు. లింగంపేట మండల కేంద్రంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకే దుకాణాలను మూసివేసేలా రెవెన్యూ, పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనవసరంగా బయటికి వచ్చే వారికి జరిమానా విధించారు. నాగిరెడ్డిపేట మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలను తెరిచి ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజలెవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
గాంధారి మండల కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటికి రావొద్దని ఎస్సై శంకర్ కోరారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో లాక్డౌన్లో భాగంగా నిజాంసాగర్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అనవసరంగా బయటికి వచ్చిన వారికి జరిమానా విధించారు. ట్రైనీ ఎస్సై తేజస్వినీ ప్రియదర్శిని, కానిస్టేబుళ్లు రమేశ్ కుమార్, ఓంకార్ నాయక్, రాధాకిషన్ ఉన్నారు.
301 దుకాణాలపై కేసులు నమోదు
కామారెడ్డి టౌన్, జూన్ 4: లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు నిబంధనలను పాటించని 301 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శ్వేతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 2331 వాహనాలను కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలను పాటించని 7,686 మందికి జరిమానా విధించామని వివరించారు.