కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు ఎలాంటి రంది లేకుండా తనకున్న ఎకరం పొలంలో యాసంగిలో కంది పంటను సాగుచేశాడు. ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ బీఎస్ఎంఆర్-736 రకం కంది విత్తనాలతో అధిక దిగుబడిని సాధించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచాడు. ఎకరానికి 14 క్వింటాళ్ల దిగుబడిని సాధించడంతో అతడిని ప్రభుత్వం ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్ రైతు శ్రీనివాస్ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అతడిని ఆదర్శంగా తీసుకొని రైతులు నూతన విధానంలో పంటలను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా సూచించారు.
సాగు పద్ధతి ఇలా..
ముందుగా చదును చేసుకున్న పొలంలో రెండు కిలోల కంది బీఎస్ఎంఆర్ -736 రకాన్ని జూన్ రెండో వారంలో మొక్కకు, మొక్కకు 13 ఫీట్ల దూరంలో సాలుకు-సాలుకు మధ్య 5 ఫీట్ల దూరంతో విత్తనాలు వేసుకోవాలి. మొక్క రెండు ఫీట్లు అనగా 45 రోజుల అనంతరం మొక్క కొనలను తుంచి వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి.
ఎరువుల వాడకం ఇలా..
ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ లేదా 50 కిలోల డీఏపీ వాడాలి.
రసం పీల్చే పురుగు నివారణకు వేపనూనె మూడు సార్లు లీటర్ చొప్పున పిచికారీ చేయాలి.
అవసరం మేరకు ఉధృతిని బట్టి పురుగు మందును తగిన మోతాదులో ఒకసారి పిచికారీ చేయాలి.
పూత, కాత సమయంలో, కాయ గట్టిపడే సమయంలో రెండు నీటి తడులను ఇవ్వాలి.
వ్యవసాయ అధికారులు సూచించిన పద్ధతులు పాటిస్తూ ఎప్పటికప్పుడు పంట పర్యవేక్షణపై యాజమాన్య పద్ధతులను పాటించాలి.
నూతన విధానంతో రైతుకు లాభం..
రైతులు నూతన పద్ధతులు పాటిస్తూ పంట మార్పిడిని అవలంబించాలి. శ్రీనివాస్ అనే రైతు బీఎస్ఎంఆర్-736 రకం సాగు చేసి అధిక దిగుబడిని సాధించాడు. ఈ రకం విత్తనాలు రైతుల కోసం అందుబాటు లో ఉన్నాయి. అవసరం ఉన్న వారు 9553754120 నంబర్ను సంప్రదించాలి.
-రాజు, మండల వ్యవసాయాధికారి,మాచారెడ్డి