ధర్పల్లి, ఏప్రిల్ 2: ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎవరైనా చనిపోతే కాష్టానికి కూడా కష్టాలు తప్పేవి కాదు. నీటి సౌకర్యం, పరిశుభ్రత సమస్యలతో బాధ పడ్డ ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారింది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామం.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి దుబ్బాక స్థితిగతులను పూర్తిగా మార్చివేసింది. పల్లెప్రగతి నిధులతో పాటు 14 ఆర్థిక సంఘం, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలో అన్ని వసతులు, సౌకర్యాలను కల్పించుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామంలోని వాగు ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చేది. ప్రస్తుతం సకల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోనే మొదటి వైకుంఠధామం నిర్మించింది ఇక్కడే. దాతల సహకారంతో శివుడి విగ్రహం, స్వర్గరథయాత్ర వాహనాన్ని సమకూర్చుకున్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి గ్రామాన్ని సందర్శించి సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు.
వెల్లివిరుస్తున్న పరిశుభ్రత..
గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరుస్తున్నది. ప్రతి రోజూ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. రోడ్డుపై చెత్త వేయకుండా అవగాహన కల్పించడంతో ప్రతి ఒక్కరూ వీధులన్నీ శుభ్రంగా ఉండేలా సహకరిస్తున్నారు. గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నారు.
ఆదర్శగ్రామంగా ఎంపిక..
మండలంలోని దుబ్బాక గతంలో ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. గ్రామంలో రోడ్ల వెంబడి మొక్కలు నాటించడం, వాటికి నిత్యం నీళ్లు పడుతూ కంటికి రెప్పలా కాపాడడంతో అవి ఏపుగా పెరిగాయి. రోడ్లన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో అందంగా కనిపిస్తున్నాయి. తమ గ్రామానికి అవార్డు రావడంతో మరింత అందంగా తీర్చిదిద్దుకుంటామని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి..
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీటీసీ జగన్ సహకారం, అండదండలతో పాటు గ్రామస్తులు తోడ్పాటును అందించడంతో గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలిగాం. జిల్లాస్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉన్నది. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.
ఇవీ కూడా చదవండి..
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశమేదో తెలుసా?
ప్రపంచ మీడియా ముందే.. అమెరికా, చైనా వాగ్వాదం
ఆఫీస్ నుంచి రెండు నిమిషాలు ముందుగా వెళ్లినందుకు జీతంలో కోత
టెల్ అవీవ్లో బెంజమిన్ నెతన్యాహు నగ్న విగ్రహం