నిజాంసాగర్ మండలంలో దళిత
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో చోటు
నారాయణ్ఖేడ్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల మధ్యలో నిజాంసాగర్
త్వరలోనే అర్హుల గుర్తింపు, నేరుగా రూ.10లక్షల సాయం
సీఎం ప్రకటనతో మురిసిపోతున్న ఉమ్మడి జిల్లా దళిత కుటుంబాలు
అట్టడుగు వర్గాలను ఉన్నతిలోకి తీసుకురావడం ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించే సదాశయంతో ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ వర్గాలకు ఆశాదీపంగా మారారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు కామారెడ్డి జిల్లాను చేరింది. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని దళితబంధు పథకం అమలుకు ఎంపిక చేయడంతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో నిజాంసాగర్ కూడా ఉందని తెలియగానే.. దళిత కుటుంబాలు, టీఆర్ఎస్ శ్రేణులు నిజాంసాగర్కు చేరుకున్నాయి. బ్యాండు మేళాలు, పటాకుల మోతల మధ్య రంగులు చల్లుకుంటూ మహిళలు, పురుషులు సంబురాలు జరుపుకొన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
5,600 దళిత కుటుంబాలు 1,646
26ఎస్సీ ఉపకులాలు
27గ్రామ పంచాయతీలు
అదృష్టంగా భావిస్తున్నా..
రూ.వేల కోట్లు వెచ్చించైనా సరే దళిత కుటుంబాలను ఆర్థికంగా ఉన్నతికి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. హుజూరాబాద్లో ఇప్పటికే పథకాన్ని అమలు చేసి చూపించిన సీఎం.. రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు మండలాలను ఎంపిక చేయడం, అందులో నా నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ఉండడం
అదృష్టంగా భావిస్తున్నా..
తెలంగాణ గ్రామీణ జీవితంలో ప్రతి పల్లెలోనూ నిరుపేద కుటుంబాలు అనేకం ఉన్నాయి. అందులో అత్యధిక శాతం మంది దళిత సమాజానికి చెందినవారే ఉన్నారు. పాలకుల నిర్లక్ష్యం మూలంగా తరతరాలుగా అట్టడుగులోనే ఉంటున్నారు. ఏడు దశాబ్దాల ఘనమైన స్వాతంత్య్ర భారతదేశంలో అలాంటి అభాగ్యుల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఉపాధి అవకాశాలు లేక, జీవనానికి ఆసరా కరువై కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవాలని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ వర్గాలకు ఆశాదీపం అయ్యారు. దళితులను ఉన్నతిలోకి తీసుకువచ్చేందుకు వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. దళిత బంధు పేరుతో ఇప్పటికే కరీంగనర్ జిల్లా హుజూరాబాద్లో అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు కామారెడ్డి జిల్లాను చేరింది. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని దళిత బంధు పథకం అమలుకు ఎంపిక చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురం వ్యక్తంమవుతున్నది. సీఎం కేసీఆర్ అన్నట్లుగానే దశల వారీగా దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టడంతో దళిత బిడ్డలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ స్వరూపం…
కామారెడ్డి జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 22 రెవెన్యూ మండలాలున్నాయి. మొత్తం జనాభా 9లక్షల 72వేల 625. ఇందులో పురుషులు 4లక్షల 78వేలు 389, స్త్రీలు 4లక్షల 94వేల 236 ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ జనాభా దాదాపు లక్షా 53వేల 302 మంది వరకున్నారు. జిల్లా జనాభాలో వీరి శాతం 15.76గా ఉంది. ఎస్సీల్లో పురుషులు 74,133మంది, స్త్రీలు 79,169 మంది ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్గా కొనసాగుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటకలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 2లక్షల 59వేల 918 మంది జనాభా ఉన్నారు. వీరిలో పురుషులు 1,30,008 మంది, స్త్రీలు 1,29,910 మంది ఉన్నారు. నియోజకవర్గం మొత్తం సుమారుగా 8వేల కుటుంబాలు నివసిస్తుండగా 40వేల మంది దళిత ప్రజలు ఉన్నారు. నిజాంసాగర్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 26 ఎస్సీ ఉపకులాలకు చెందిన 1646 దళిత కుటుంబాలున్నాయి. మొత్తం 5600 మంది జనాభా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
నిజాంసాగర్లోనే ఎందుకంటే..?
దళితబంధుకు రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు మండలాలు ఎంపికయ్యాయి. ఇందులో కామారెడ్డి జిల్లా నుంచి జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేశారు. మధిర నియోజకవర్గంలో చింతకాని, తుంగతుర్తి నుంచి తిరుమలగిరి, అచ్చంపేట నుంచి చారకొండ మండలాలున్నాయి. నాలుగు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాలుగు మండలాలు ఎంపికవ్వగా ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా ఉన్న జుక్కల్ నియోజకవర్గం కూడా ఉంది. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు సరిహద్దును పంచుకునే నిజాంసాగర్ మండలం ఎంపిక కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ మండలం భౌగోళికంగా వెనుకబాటుకు గురైన నారాయణ్ఖేడ్ నియోజకవర్గానికి, ఇటు ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో దళితబంధు అమలు చేయడం ద్వారా చుట్టూ మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు పథకం అమలు తీరుతెన్నులపై అవగాహన రానున్నది.
దళితబంధు మరిచిపోలేం
నా భార్య కొన్నేండ్లకిందటనే చనిపోయింది. కొడుకు, కోడలు, వారి పిల్లలు అందరం ఒక్కతానే ఈ గుడిసెలనే ఉంటున్నం. పశువులకొట్టం ఇంతకన్న మంచిగుంటది. అయినా తప్పుతలేదు. కుటుంబమంతటికీ ఇల్లు సరిపోతలేదు. రాత్రిపూట కొడుకు కుటుంబం ఇంట్ల ఉంటే, నేను చావిడి కాడనో, వేరేవాళ్ల ఇండ్లదగ్గరనో పడుకుంటున్న. కొడుకు సఫాయి పనికి పోతడు. కేసీఆర్సారు నాకు ఇస్తున్న పింఛను డబ్బులతోనే కుటుంబం గడుస్తున్నది. ఆయన తెచ్చిన దళితబంధుతో మా అసుంటోళ్ల బతుకులు బాగుపడ్తయి. సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
దళితజాతికి ధైర్యం.. దళితబంధు
కొంతకాలంగా దళిత కుటుంబాల్లో దళితబంధు చర్చ జోరుగా సాగుతున్నది. హుజూరాబాద్ దళిత కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి లభించడం, శాశ్వతంగా పేదరికానికి దూరమయ్యేలా సీఎం కేసీఆర్ స్వయంగా పథక రచన చేయడంపై ఆసక్తి పెరిగింది. తమకు మంచి ఉపాధిని ఎంచుకునే అవకాశం లభించబోతున్నదనే సంతోషం ఆయా కుటుంబాల్లో కనిపిస్తున్నది. రూ.10లక్షలతో వివిధ యూనిట్ల స్థాపనకు రకరకాల ఆలోచనలు చేసుకుంటున్నారు. సర్కారు అందించే గ్రాంటు ద్వారా లబ్ధిదారుడు నికరంగా మంచి ఆదాయం పొందడానికి వీలైన యూనిట్ ప్రారంభించునే అవకాశం ఏర్పడింది. కొంతమంది జత కూడితే చిన్న లేక మధ్య తరహా పరిశ్రమనే పెట్టుకోవచ్చు. సర్కారు అందించిన రూ.10లక్షల నగదు తిరిగి చెల్లించాల్సిన భయం లేదు. ఫలితంగా వచ్చిన ఆదాయం సంపూర్ణంగా దళిత కుటుంబాలే వినియోగించుకోవచ్చు. యూనిట్ విజయవంతానికి ప్రభుత్వ పర్యవేక్షణ, మార్గదర్శకం ఎల్లవేళలా ఉంటాయి. అణగారిన జాతిలో ధైర్యం నింపే అన్ని అంశాలూ దళితబంధులో కనిపిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.