లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలోని దరి చెరువు కట్టకు పడిన గండిని నీటి పారుదల శాఖ అధికారులు సకాలంలో పూడ్చి వృథాగా పోయే నీటిని అడ్డుకున్నారు. మంగళవారం రాత్రి దరి చెరువు తూము వద్ద చిన్న గండి పడిన విషయాన్ని గుర్తించిన రైతులు గండిని పూడ్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో వెనుదిరిగి వచ్చారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నాం వరకు చెరువులోని నీరు వృథాగా పోయినట్లు రైతులు తెలిపారు. రాత్రి నుంచి నీటి ప్రవాహం కొనసాగడంతో చిన్న గండి కాస్త నీటి ప్రవాహానికి మట్టి కోతకు గురై కట్ట తెగిందని వెల్లడించారు.
దీంతో చెరువు ఆయకట్టు కింద వరి పొలాల్లోకి నీరు, మట్టి మేటలు వేయడంతో వరి పంట నేలవాలిందని వివరించారు. బుధవారం మధ్యాహ్నాం నీటి పారుదల శాఖ అధికారులు జేసీబీల సహాయంతో కట్టెలు అడ్డం వేసి వాటిపై ఇసుక బస్తాలను వేసి గండిని పూడ్చివేశారు. గండి పడిన ప్రాంతాన్ని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ నాగేందర్, ఈఈ మల్లేశం, డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ ప్రసాద్, తాసిల్దార్ అమీన్సింగ్, గిర్దావర్ బాలయ్య, ఎస్సై శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యుడు వెంకటి, సర్పంచ్ మణిగిరి పద్మ, ఉప సర్పంచ్ రామానుజచారి, పోల్కంపేట, కన్నాపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.