లింగంపేట, మే 5: పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల గ్రామాలు సుందరంగా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోనే చిన్న పంచాయతీగా ఉన్న మెంగారం గ్రామానికి అప్పట్లో సరైన నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. గ్రామ జనాభా తక్కువగా ఉండడంతో అరకొర నిధులు మాత్రమే వచ్చేవి. గ్రామాభివృద్ధికి సరిపడా నిధులు రాకపోవడంతో సమస్యలు తీరేవి కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పథకం అమలు చేయడంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా పంచాయతీకి నిధులు కేటాయించడంతోపాటు గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ అందించారు. దీంతో వీధులన్నీ శుభ్రంగా మారాయి. నిత్యం గ్రామంలో ట్రాక్టర్ తిప్పుతూ ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను గ్రామ శివారులో నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కంపోస్టు షెడ్డును నిర్మించి సేకరించిన చెత్తను అందులో వేసి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపడుతూ మురికి లేకుండా చూస్తున్నారు. ప్రతినెలా డబ్బులు మంజూరు కావడంతో గ్రామంలో వైకుంఠధామం, విలేజ్ పార్క్ పనులు పూర్తిచేశారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణంతో అంతిమ సంస్కారాల చింత తీరింది.
ప్రతినెలా నిధులు వస్తున్నాయి..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా నిధులు వస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో నిధులు సరిగా రాక అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం వస్తున్న నిధులతో అభివృద్ధి పనులను పూర్తిచేయించాం. గ్రామంలో నిత్యం చెత్తను సేకరించడంతో వీధులన్నీ శుభ్రంగా మారాయి. ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.
మహేశ్, సర్పంచ్, మెంగారం