కామారెడ్డి టౌన్, మే 5: ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో గురువారం నుంచి కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించాలని కలెక్టర్ శరత్ వైద్య, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు, డీఎల్పీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు గురువారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించాలని, వాటి నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏరియా దవాఖానలు, పీహెచ్సీ, సీహెచ్సీ, సబ్సెంటర్, ప్రైవేటు దవాఖానల్లో, అలాగే ఆర్ఎంపీ, పీఎంపీ దవాఖానల వద్ద కొవిడ్ ఓపీ సేవలపై బ్యానర్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ర్యాపిడ్ బృందాల్లో ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఏ, వీఆర్వోల భాగస్వామ్యంతో ప్రతి ఇంటిని సందర్శంచాలని, ఆరోగ్య పరిస్థితులను రిజిష్టర్లలో నమోదు చేయాలని, వారికి ఇచ్చిన మందుల వివరాలు, వాడుతున్న మందులు వివరాలను నమోదు చేయాలని, ర్యాపిడ్ బృందాలను మెడికల్ ఆఫీసర్లు, తహసీల్దార్ల్లు, ఎంపీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ వేసుకునేలా ఏఎన్ఎం, ఆశ సిబ్బంది చర్యలు తీసుకోవాలని, ఈ నెల 15లోగా వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు, ప్రైవేటు దవాఖానలకు తహసీల్దార్లు పర్యవేక్షకులుగా ఉంటారని, నార్మల్, ఓపీ ఐసీయూ, ఆక్సిజన్ దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. సరిహద్దులో చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలని, ఎవరైనా వస్తే వారిని 14 రోజులపాటు హోంకార్వంటైన్ చేయాలని, కమ్యూనిటీ వాచింగ్లను పకడ్బందీగా నిర్వహించాలని, ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లను రవాణా చేసే వాహనాల వివరాలను నమోదు చేసుకోవాలని, అనుమానం వస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి. వెంకట మాధవ్రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఏరియా దవాఖాన కోఆర్డినేటర్ డాక్టర్ అజయ్కుమార్, జిల్లా రవాణా అధికారి వాణి, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, ఐసీడీఎస్ అధికారి అనురాధ, స్పెషల్ ఆఫీసర్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు