బిచ్కుంద : ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు త్వరలోనే బీసీ బంధు పథకం అమలు చేయనున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. గురువారం బిచ్కుంద మండలకేంద్రంలో కమ్మరి చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన అనంతరం ఏర్పటు చేసిన గంగాపుత్ర కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న దళితులుఆర్థికంగా ఎదిగేందుకు ఉద్ధేశించిన దళిత బంధుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో జుక్కల్ నియోజక వర్గం నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీసీలకు కూడా బీసీ బంధు పథకాన్ని ప్రవేశ పెడతామని సీఎం పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో గంగపుత్ర కులస్తులకు చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి చేప పిల్లలను పంపిణీ చేస్తుందని, వాటిని విక్రయించుకోవడానికి ద్విచక్రవాహనాలను కూడా అందించిందని తెలిపారు. గంగపుత్రులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని దీంతో చెరువులపై ఆధారపడ్డ రైతులు, గంగపుత్రులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ భారతిరాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.