కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 1960లు, సాధారణ రకానికి రూ. 1940లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరిచి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే మండల స్థాయి కమిటీలకు, మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈసారి 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన లారీలను రైస్ మిల్లర్లు 12 గంటల లోపు అన్ లోడింగ్ చేసే విధంగా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్పర్సన్ శోభ, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, సివిల్ సప్లె డీఎం జితేంద్ర ప్రసాద్, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.