నెలరోజుల ముందుగానే నిండిన ప్రాజెక్టు
కురుస్తున్న వర్షాలతో కొనసాగుతున్న వరద
రెండు మండలాల్లో 18వేల ఎకరాలకు సాగునీటి సరఫరా
యాసంగికీ ఢోకా లేనట్టే!
నాగిరెడ్డిపేట్, జూలై 29: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గతేడాది కన్నా ఒకనెల ముందుగానే ప్రాజెక్టు నిండుగా ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల్లో మొత్తం 18వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నాగిరెడ్డిపేట్ మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గతేడాది కన్నా ఒకనెల ముందుగానే ప్రాజెక్టు నిండుగా ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండలంలోని 25 గ్రామాలకు పోచారం ప్రాజెక్టు సాగునీరు అందిస్తోంది. పక్క మండలమైన ఎల్లారెడ్డికి తాగు, సాగునీరు అందించడం గమనార్హం. నాగిరెడ్డి పేట్, ఎల్లారెడ్డి మండలాలకు మొత్తం 18వేల ఎకరాలకు 13 కాలువల ద్వారా సాగునీరు అందుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు (1464 ఎంసీఎఫ్టీ) ఉండగా, నీటి మట్టం అదేస్థాయిలో ఉన్నది. దీంతో వానకాలం, యాసంగి రెండు పంటలకు పుష్కలంగా నీరు అందనున్నది. ప్రతిఏడాది ఆగస్టు నెలలో ప్రాజెక్టు నిండేది..కానీ ఈ సంవత్సరం నెల ముందుగానే నిండుకుండలా మారింది. వానకాలం పంటలకు గాను ఈ నెల 23న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ రెండు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
ఆహ్లాదం పంచుతున్న పరిసర ప్రాంతాలు
పోచారం ప్రాజెక్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో పర్యాటకులు తరలివస్తున్నారు. కామారెడ్డి జిల్లాతో పాటు మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, రామాయంపేట్, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి సందడి చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టు ఈ నెల 22వ తేదీన రాత్రి పూర్తిస్థాయిలో నిండడంతో 23న నీటిని విడుదల చేశామని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు నిండి పొంగిపొర్లిన నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుందన్నారు.
ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
పోచారం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి గురువారం 484 క్యూసెక్కుల వరద వచ్చినట్లు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా 80 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు పేర్కొన్నారు. మరో 404 క్యూసెక్కుల నీరు పొంగిపొర్లుతున్నదని తెలిపారు. ప్రాజెక్టు ప్రస్తుతం 21 అడుగుల వద్ద నీటితో కళకళలాడుతోంది.
మా మండలంలో ప్రాజెక్టు ఉండడం అదృష్టం
ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ముందుగానే పూర్తిస్థాయిలో నిండడంతో సాగు పనులన్నీ చకాచకా జరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు డబ్బులతో పొలానికి కావల్సిన మందులన్నీ తీసుకున్నాం. నాట్లు వేయడం కూడా అయిపోయింది. పోచారం ప్రాజెక్టు మా మండలంలో ఉండడం అదృష్టం.
–లింగాగౌడ్, రైతు, గోలిలింగాల్ గ్రామం