నేటి నుంచి సినిమా థియేటర్లు ప్రారంభం
కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహణ
ప్రేక్షకుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం
అభిమాన తారల చిత్రాల కోసం ఎదురుచూపులు
ఖలీల్వాడి, జూలై 29: కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి అందరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. దీంతో జనజీవనం అతలాకుతలం కాగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. ఇందులోభాగంగా వినోదం పంచే సినిమారంగంపై ప్రభావం చూపగా..లాక్డౌన్లో థియేటర్లను సైతం మూసివేశారు. దీంతో సినిమా పరిశ్రమ పై ఆధారపడిన వేలాది మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టడం.. అన్లాక్లో భాగంగా కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినీ పరిశ్రమపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ థియేటర్లను పునః ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో కొత్త సినిమాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెండితెరపై తమ అభిమాన తారల చిత్రాలు ఆడనుండడంతో ప్రేక్షకుల్లో హుషారు కనిపిస్తున్నది. నేటి (శుక్రవారం) నుంచి నిజామాబాద్ జిల్లాలో థియేటర్లన్నీ ప్రారంభించనున్నారు. ఉషాప్రసాద్ మల్టీప్లెక్స్, దేవి, లలితామహల్ థియేటర్లు పునః ప్రారంభం కానున్నాయి.
కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే!
గత మార్చి 16న టాకీసులను మూసివేశారు. కరోనా విజృంభించిన నేపథ్యంలో అందులో పనిచేసేవారు ప్రత్యామ్నాయంగా ఇతర పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు. జిల్లా కేంద్రంలో అన్ని థియేటర్లను ఓపెన్ చేయడంలేదు. కేవలం మూడు థియేటర్లలో మాత్రమే చిత్రాలను ప్రదర్శించనున్నారు. కరోనా కారణగా పెండింగ్లో ఉన్న అనేక చిత్రాలు వరుసగా థియేటర్లలోకి వచ్చే అవకాశాలూ లేకపోలేదని సినీ అభిమానులు చెబుతున్నారు. థియేటర్లన్నీ బంద్ కావడంతో ప్రజలంతా కరోనా కాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వెతుక్కున్నారు. ఎంటర్టైన్మెంట్ విభాగంలో వచ్చిన అధునాతన సాంకేతికతను వినియోగించుకున్నారు. కొంగొత్త సినిమాలను చూసేందుకు థియేటర్ల అవసరం లేకుండానే వచ్చిన ఓటీటీలకు గడిచిన ఏడాది కాలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సినిమా టాకీసుల అవసరం లేకుండా ఇంట్లోనే ఇంటిల్లిపాది సినిమాలు చూశారు. ఈ కొత్త అనుభవానికి అలవాటైన వారంతా తిరిగి సినిమా థియేటర్ల మెట్లు ఎక్కుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సినిమా టాకీసుల నిర్వాహకులు తప్పనిసరిగా కొవిడ్ -19 నిబంధనలు పాటించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.