నిజామాబాద్ లీగల్, జూలై 29 : మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడంతోపాటు ఆర్థిక విషయాల్లో దూషించడం కూడా చట్టం దృష్టిలో నేరమేనని నిజామాబాద్ ప్రిన్సిపల్ , జూనియర్ సివిల్ జడ్జి జి.కళార్చన అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాసదన్లో గురువారం నిర్వహించిన న్యాయచైతన్య సదస్సులో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణకోసం మహిళలపై లైంగిక వేధింపుల (నిరోధకం, నిషేధం, నివారణ) చట్టం-2013 అమలులో ఉందన్నారు. పదిమంది కన్నా ఎక్కువ మంది పనిచేస్తున్న ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలన్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, మహిళలకు ఎక్కువ రక్షణను చట్ట పరంగా ఏర్పాటు చేసిందని, దీనిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతి రంగాల్లో ఎదగాలని కోరారు. ప్రతి మహిళా చట్టాల ప్రయోజనాలను, విలువను తెలుసుకుని నిత్య జీవనంలో రక్షణ పొందాలన్నారు. సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ మాట్లాడుతూ సుప్రీం, హైకోర్టుల ఆదేశాల మేరకు న్యాయ చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. లైంగిక దాడులకు గురైన వారికి, మానసిక, మత్తు పదార్థాల బాధితులకు, మానవ అక్రమ రవాణాకు గురైన బాలలు, మహిళలకు ప్రభుత్వ తోడ్పాటుతో న్యాయసేవ అధికార సంస్థ ఆర్థిక తోడ్పాటునందిస్తుందని తెలిపారు. సదస్సులో న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, ఆశనారాయణ, మాణిక్రాజ్, షీ టీమ్ సభ్యులు రేఖారాణి, సవితారాణి, సఖీ సెంటర్ కవిత, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉద్యోగినులు పాల్గొన్నారు.