యూవీ కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ దవాఖానలో 120 బెడ్స్ ఏర్పాటు
వర్చువల్గా ప్రారంభించిన మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్
యువీ సేవలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషిపై హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంస
జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్, మేయర్
ఖలీల్వాడి జూలై 28: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్సీ కవిత చొరవతో యూవీ కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 120 క్రిటికల్ కేర్ బెడ్లను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వర్చువల్గా బుధవారం ప్రారంభించారు. యువరాజ్ తల్లి షబ్నంసింగ్ కూడా పాల్గొని ప్రసంగించారు. బెడ్లతో దవాఖానలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును కలెక్టర్ నారాయణరెడ్డి, మేయర్ నీతూకిరణ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, మేయర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దవాఖానకు రూ.2.5 కోట్లతో 120 క్రిటికల్ కేర్ బెడ్లు అందించడం సంతోషకరమని అన్నా రు. ఇందులో 18 పడకలకు మల్టీ చానల్ మానిటర్స్ ఉన్నాయని తెలిపారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అహోరాత్రులు కృషిచేసిన ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బందిని అభినందించారు.
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకరించిన యువరాజ్కు, ఎమ్మెల్సీ కవితకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వారు అనుకున్న లక్ష్యాన్ని బాధ్యతగా నెరవేరుస్తామన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ దవాఖాన ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాలోని బాధితులకు ఆక్సిజన్, రెమ్డెసెవిర్ వంటి ఔషధాలను సమకూర్చారని గుర్తుచేశారు. నెల క్రితం మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో, ‘యూ వీ కెన్’ ప్రతినిధులతో పలుమార్లు మాట్లాడి జిల్లాకు 120 ఐసీయూ బెడ్లు, వైద్య పరికరాలు సమకూర్చారని, ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ అర్వింద్బాబు, వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు జీవన్రావు, యూవీ కెన్ ప్రతినిధులు సృజన్, వెంకట్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.