గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు
నిజామాబాద్ జిల్లాలో 550 మందికి రూ.55 కోట్లు
త్వరలో దళిత మేధావులు, పారిశ్రామిక వర్గాలతో సమావేశం
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నిజామాబాద్, జనవరి 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం విజయవంతమైతే లక్షలాది కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయి. దళితబంధును పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం..’ అని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ‘నమస్తే తెలంగాణ’కు సోమవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దళితబంధు కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ పరిధిలోని నాలుగు మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రెండురోజుల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను నియమిస్తామని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు తొలిదశలో మొత్తం 550 స్వయంఉపాధి యూనిట్లు మంజూరయ్యాయని, ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా పూర్తిపారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రక్రియను చేపడుతామని ఆయన వెల్లడించారు.
దళితబంధు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమల్లోకి తెచ్చింది. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందించింది. హుజూరాబాద్ నియోజకవర్గం, సీఎం దత్తత గ్రామం వాసాలమర్రితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్లో పరిమితి లేకుండా అమలు చేయనున్నది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల పేరిట ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తీసి రూ.10లక్షలు జమ చేయనున్నది. స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నది. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక విధానంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం ప్రకటించింది. నియోజకవర్గంలో ఎంపిక చేసే వంద మందిని కలెక్టర్తో సంప్రదించి స్థానిక ఎమ్మెల్యే ఖరారు చేయనున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ(నాలుగు మండలాలు)ల్లో ఎంపికకు కసరత్తు మొదలైందని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
నమస్తే : జిల్లాలో దళితబంధు కార్యక్రమం అమలు ఎంత వరకు వచ్చింది?
కలెక్టర్ : నిజామాబాద్ జిల్లాలో దళితబంధు కార్యక్రమం అమలుకు కసరత్తు ప్రారంభించాం. దాదాపు 15 శాఖలను ఈ పథకంలో భాగం చేశాం. ఆయా శాఖల ఆధ్వర్యంలో దాదాపు 100 యూనిట్లు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దళితబంధుకు సెలెక్ట్ అయిన వ్యక్తికి ఈ వివరాలను అందివ్వడం ద్వారా సులువుగా యూనిట్ను ఎంపిక చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే శాసన సభ్యులతో సంప్రదింపులు జరిపాం. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
పథకం అమలుకు క్షేత్రస్థాయి ప్లానింగ్ ఎలా ఉండబోతున్నది.?
రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.10లక్షలతో దళిత కుటుంబం తలరాతను మార్చే విధంగా ఉపయోగించాలన్నది మా ఉద్దేశం. వంద శాతం రాయితీతో అందిస్తున్న ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కొండంత అండ దొరుకుతుంది. ఈ మొత్తంతో స్వయం ఉపాధి పొందే విధంగా పటిష్టవంతంగా కృషి చేయబోతున్నాం. క్షేత్రస్థాయిలో పథకం అమలుకు కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకట్రెండు రోజుల్లో కమిటీలు పూర్తవుతాయి. నియోజకవర్గాలకు జిల్లాస్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించబోతున్నాం.
దళిత బంధు పథకంలో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారా? స్థానిక
అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తారా?
దళితబంధు పథకం ద్వారా దళిత కుటుంబాల్లో వెలుగులు ప్రసాదించాలన్నదే సర్కారు అంతిమ లక్ష్యం. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం ద్వారా వారి కాళ్లపై వాళ్లు నిలబడి స్వయం ఉపాధి పొందే విధంగా యూనిట్లు ఎంపిక చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా భౌగోళికంగా వ్యవసాయిక ప్రాంతం ఉండడంతో చాలా మందికి అనుబంధ పనుల ద్వారా ఉపాధి కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని ఆలోచించాం. వ్యవసాయ అనుబంధ పనులతో పాటు పారిశ్రామిక యూనిట్లు స్థాపించడానికి ఆయా ప్రైవేటు కంపెనీలతోనూ మాట్లాడుతున్నాం. మొత్తానికి రూ.10లక్షలతో లబ్ధిదారుడు గౌరవంగా లాభాలు ఆర్జించి సంతోషంగా జీవించాలన్నది సంకల్పంగా పెట్టుకున్నాం.
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు ఎన్ని నిధులు అవసరం కావొచ్చు?
నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గానికి 100 యూనిట్లు చొప్పున మొత్తం 550 యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బాన్సువాడ నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో నిజామాబాద్లో 50 యూనిట్ల మంజూరుకు ఆస్కారం ఏర్పడింది. ఈ మొత్తం యూనిట్లు మంజూరు చేసేందుకు రూ.55కోట్లు నిధులను అవసరం అవుతాయి.
ఈ పథకంలో ఎమ్మెల్యేల పాత్ర ఏమిటి? వారి భాగస్వామ్యం ఎలా ఉండబోతున్నది?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల పాత్రనే కీలకం. లబ్ధిదారుల ఎంపికలో వారే క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. పథకం విజయవంతంకావడానికి వారి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నాం. తదనుగుణంగా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నాం.
దళితబంధు పథకం చాలా ప్రత్యేకమైనది. ఈ పథకం అమలులో మీరు పాత్ర వహిస్తుండడం ఎలా ఫీలవుతున్నారు?
నిజామాబాద్ కలెక్టర్గా దళితబంధు పథకం అమలులో పాలుపంచుకోవడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నాను. చాలా మంది పేదల బతుకులను మార్చేందుకు ప్రభుత్వం కల్పించిన ఓ అవకాశం ఇది. ప్రభుత్వ ఉద్దేశాల మేరకు యూనిట్ ధరకు తగ్గట్లుగా ప్రైవేటు రంగంలో లబ్ధిదారులకు విశేష అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. అవసరమైతే నా సొంత పరిచయాలను ఉపయోగించి దళిత కుటుంబాలకు లాభం చేయాలన్నది నా ఆలోచన. యూనిట్ ధర రూ.10లక్షలు దాటితే తదనుగుణంగా లబ్ధిదారులను చేర్చి సమూహంగా ఏర్పాటు చేసి యూనిట్ మంజూరు చేస్తాం. ఉదాహరణకు యూనిట్ ధర రూ.20లక్షల వరకు ఉంటే ఇద్దరు లబ్ధిదారులను జోడించి వారికి లాభం చేకూర్చే విధంగా ప్రయత్నిస్తాం.