న్యూఢిల్లీ, జూలై 6: భారత్లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీని జపాన్ దిగ్గజ సంస్థ సుమిటుమో మిత్సుయ్ ఫైనాన్షియల్ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీ విలువ 2.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.18,550 కోట్లు). ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్లో 74.9 శాతం వాటాను కొనేందుకు ఈ కంపెనీ మాతృ సంస్థ అయిన ఫుల్లర్టన్ ఫైనాన్షియల్ సర్వీసెస్తో సుమిటుమో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాగా, ఫుల్లర్టన్ ఇండి యా క్రెడిట్ దేశంలో 600 పట్టణాలు, 58,000 గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ ఎన్బీఎఫ్సీకి 629 శాఖలుండగా, 13,000 మంది ఉద్యోగులు న్నారు. 23 లక్షల ఖాతాదారుల బేస్ను కలిగి ఉన్నది.