‘థియేటర్ల వ్యవస్థ బాగుంటేనే సినీ పరిశ్రమ మనుగడసాగిస్తుంది. థియేటర్లు లేకపోతే స్టార్డమ్కు విలువ ఉండదు’ అని అన్నారు ఎస్.కె.ఎన్. నిర్మాత, సహనిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారాయన. నేడు ఎస్.కె.ఎన్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
థియేటర్ అనుభూతికి ఓటీటీలు సాటిరావు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొందరు నిర్మాతలు ఓటీటీలవైపు వెళుతున్నారు. ఆర్థికపరమైన భారాల వల్ల వారి నిర్ణయంలో తప్పు లేదు. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ మంది స్టార్స్ ఉన్నారు. స్టార్సినిమాలు, నాన్స్టార్ సినిమాలు ఒకే ఓటీటీలో విడుదలైతే స్టార్స్ విలువ పడిపోతుంది. అదే జరిగితే సినిమాల బడ్జెట్లు తగ్గి లార్జర్ దేన్లైఫ్ సినిమాల్ని రూపొందించే అవకాశం ఉండదు. థియేటర్ వ్యవస్థ బాగుంటేనే స్టార్స్కు, ఇండస్ట్రీకి లాభదాయకం. ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల ఆరంభం నుంచి పూర్తిస్థాయిలో థియేటర్లు పునఃప్రారంభమవుతాయని అనుకుంటున్నా.
భాగస్వామ్యమే మేలు
సోలోగా కంటే భాగస్వామ్యంతో సినిమాల్ని నిర్మించడంలో పలు ఉపయోగాలుంటాయి. కలిసి పనిచేస్తే మూడింతల ఫలితాన్ని పొందవచ్చు. నిర్మాత, సహనిర్మాతగా ఏదైనా నా వంతు బాధ్యతల్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తా. నేను, మారుతి, బన్నీవాస్, యూవీ వంశీ అందరం సినిమాల్లోకి రాకముందు నుంచి స్నేహితులం. భాగస్వామ్యంలో మేము చేసే సినిమాల విషయంలో కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. అల్లు అరవింద్ సలహాలు సూచనలు తీసుకుంటాం.
నిర్మాతగా పలు చిత్రాలు..
ప్రస్తుతం మారుతి నిర్దేశకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నా. అలాగే ‘కలర్ఫొటో’ నిర్మాత సాయిరాజేష్తో మూడు సినిమాలు, దర్శకుడు సందీప్రాజ్తో రెండు సినిమాలు చేయాల్సివుంది. ఆషాఢం తర్వాత ఆ సినిమాల వివరాల్ని వెల్లడిస్తా. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’కు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నా. అలాగే ‘ఆహా’ ఓటీటీ కోసం ‘త్రీరోజెస్’ అనే వెబ్సిరీస్ నిర్మిస్తున్నా. జీఫైవ్తో పాటు అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం వెబ్సిరీస్లను రూపొందించే ఆలోచన ఉంది. దర్శకులు కరుణకుమార్, విఐ ఆనంద్, రాహుల్ సాంకృత్యాన్లతో సినిమాలు చేస్తా. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో మారుతి, నేను కలిసి ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టాం.