మేడ్చల్ రూరల్, జూలై 4 : పల్లెలు పచ్చగా మారాలని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సర్పంచులు, అధికారులకు సూచించారు. మండల పరిధిలోని రాజబొల్లారం, రాయిలాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎవెన్యూ ప్లాంటేషన్ విషయంలో చాలా వెనుకబడి ఉందని, హరితహారంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు సూచించారు. పల్లెలు పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా ప్రజలకు అవసరమైన మొక్కలను అందజేయాలన్నారు. రహదారులకు ఇరువైపులా నాటే మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజబొల్లారంలో పల్లె ప్రగతి పనులు, వైకుంఠధామాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఉన్న సమస్యలు, పెండింగ్ పనులను పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో దేవసహాయంను ఆదేశించారు. అనంతరం ఘనపూర్ తండాలో పర్యటించిన కలెక్టర్కు స్థానికులు సీసీ రోడ్డు, వైకుంఠధామాన్ని నిర్మించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కలెక్టర్ రాయిలాపూర్ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని పరిశీలించారు.కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, సర్పంచులు నర్మదాగోపాల్రెడ్డి, బాయమ్మ రాములు, జడ్పీ సీఈవో దేవసహాయం, డీఆర్డీఓ పద్మజరాణి, డీపీఓ రమణమూర్తి, ఎంపీడీఓ శశిరేఖ, పంచాయతీ కార్యదర్శులు విజయ, స్వరూప, నాయకులు పాల్గొన్నారు.