పర్యాటక కేంద్రంగా మల్కపేట
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు
మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ఏర్పాట్ల పరిశీలన
కోనరావుపేట, జూన్ 30: పాడి పశువులతోనే రైతులు ఆర్ధికంగా అభివృద్ధి చెందవచ్చని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు పేర్కొన్నారు. మల్కపేట గ్రామంలో గురువారం మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తన స్వగ్రామమైన మల్కపేట గ్రామాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చలిమెడ జానకీదేవి ట్రస్టు ద్వారా మాజీ న్యాయశాఖ మంత్రి చలిమెడ ఆనందరావు రూ.కోటీ 50లక్షలతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలను ఆధునిక హంగులతో అన్ని వసతులతో చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలు, మండలాల సౌకర్యార్థం రూ.కోటీ 50లక్షలతో పాల శీతలీకరణ కేంద్రాన్ని నిర్మించామన్నారు. దీనిని కూడా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామంలో 3 టీఎంసీల రిజర్వాయర్ను నిర్మించడంతో రానున్న రోజుల్లో మల్కపేట మంచి పర్యాటక కేంద్రంగా మారనుందని వెల్లడించారు. అందులో భాగంగానే ప్రజలకు నాణ్యమైన పాలు, పాల పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో డెయిరీ తరఫున ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. దీంతో సిరికొండ, కోనరావుపేట మండలాల్లో దాదాపు 27 గ్రామాలకు మల్కపేట కేంద్రంగా మారునుందన్నారు. ఈ గ్రామాల నుంచి 3వేల లీటర్ల పాలసేకరణ జరుగుతున్నదన్నారు. రైతులు కూడా ఆర్థికంగా ఎదగాలంటే కచ్చితంగా పాడి పశువులను పెంచుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలోకి పాలు ఇతర రాష్ర్టాల నుంచి సరఫరా అవుతున్నాయని, అందుకే ఇంటికో గేదే, ఆవును ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని, దీనికోసం రాయితీ ఇస్తున్నదని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం పాడి రైతులకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందించిందన్నారు. కరీంనగర్ డెయిరీ ద్వారా రూ.15కోట్ల 90లక్షలు ట్రెజరీకి పంపించామన్నారు. రెండు రోజుల్లో పాడి రైతుల ఖాతాల్లో జమవుతాయని వివరించారు.
మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి..
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పర్యటనను విజయవంతం చేయాలని కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు కోరారు. ముందుగా కొలనూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. రోడ్డుకు ఇరువైపులా 200కు పైగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం మల్కపేట గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని, తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారన్నారు. ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎంపీపీ చంద్రయ్యగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డితో కలిసి సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, సర్పంచులు ఆరె లత, సంతోష్, దేవయ్య, ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.