జూలై 1 నుంచి పది రోజులపాటు కార్యక్రమాలు
ప్రతి జిల్లాకు రూ.25 లక్షలు విడుదల చేస్తూ ప్రణాళికశాఖ ఉత్తర్వులు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.01 కోట్ల మొక్కల పెంపకం
సర్కారు ఆదేశాలతోసిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
ఇప్పటికే మౌలిక వసతుల కల్పనతో మారిన రూపురేఖలు
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు, పట్టణాలు
జూలై ఒకటి నుంచి మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతి, ఏడో విడుత హరితహారం కార్యక్రమాలు అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మరో వారంలో ప్రారంభంకానున్నాయి. ఊరూ.. వాడను.. పచ్చగా, పరిశుభ్రంగా మార్చేందుకు పది రోజుల పాటు పనులు చేపట్టనుండగా, ఇందుకు సర్కారు ముందుగానే ప్రతి జిల్లాకూ రూ. 25 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించడం, విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించడం, రోడ్లు బాగు చేయడం, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం వంటివి అనేకం నిర్వహించనుండగా, యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.01 కోట్ల మొక్కలు నాటనుండగా, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) :ప్రారంభంకానున్నాయి. 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలవారీగా ముందుగానే నిధులు విడుదల చేసింది. జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున విడుదల చేస్తూ ప్రణాళికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాలతో పల్లెలు ప్రగతిబాట పట్టాయి. గతానికి భిన్నంగా ప్రభుత్వం పంచాయతీలకు అవసరమైన నిధులను ప్రతి నెలా ఠంచనుగా విడుదల చేస్తున్నది.
రెండు విడుతల్లో సత్ఫలితాలిచ్చిన పల్లె, పట్టణ ప్రగతి..
గతంలో రెండు విడుతల్లో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. మొదటి విడుతలో భాగంగా పల్లెల్లో సెప్టెంబర్ 6, 2019 నుంచి అక్టోబర్ 5 వరకు నెల రోజులపాటు.. రెండో విడుతలో భాగంగా జనవరి 2, 2020 నుంచి 11 వరకు పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించింది. మొదటి విడుతగా పట్టణాల్లో ఫిబ్రవరి 25, 2020 నుంచి మార్చి 6 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జూన్ 1, 2020 నుంచి 8 వరకు పారిశుధ్య డ్రైవ్ కొనసాగింది. నిర్మల్ జిల్లాలో 18 మండలాల పరిధిలో గల 396 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు.. ఆదిలాబాద్ జిల్లాలోని 467 పంచాయతీలు, మున్సిపాలిటీలోని 49 వార్డులు.. మంచిర్యాల జిల్లాలో 311 పంచాయతీలు ఉండగా.. ఏడు మున్సిపాలిటీలు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 334 పంచాయతీలు ఉండగా.. ఒక మున్సిపాలిటీలలో కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో జిల్లా, మండల, గ్రామ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో మురుగు కాలువలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమల నివారణ, తాగునీరు, రక్షిత చర్యలు, రోజువారీ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, నిర్వహించారు. సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల రూపు రేఖలు మారిపోయాయి. ఊరూరా మౌలిక వసతులు కల్పించింది. పూర్తిగా సమస్యలు పరిష్కారమయ్యాయి. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు.
ఏడో విడుత హరితహారానికి సన్నద్ధం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడవులను 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా యేటా వానకాలం ప్రారంభంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నది. ఆరు విడుతలుగా హరితహారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 కోట్లకుపైగా మొక్కలు నాటగా.. వీటిలో 65-70 శాతం వరకు బతికాయి. ప్రతి యేడాది చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ కొత్తగా మొక్కలను నాటుతున్నారు. తాజాగా ఏడో విడుత మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 1 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడో విడుతలో 2.01 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మల్ జిల్లాలో 65 లక్షలు, ఆదిలాబాద్లో 43.64 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 52.68 లక్షలు, మంచిర్యాలలో 40.28 లక్షలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, మున్సిపాలిటీ, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టారు.
పల్లెలకు నిధులు కేటాయింపు ఇలా..
పల్లె ప్రగతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీలకు జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కలిపి ప్రతి నెలా ఒక్కో పౌరుడికి 132 చొప్పున ఏడాదికి 1,632 చొప్పున పంచాయతీకి మంజూరు చేస్తున్నారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుంచి నేరుగా నిధులు వస్తుండగా, వీటిని పల్లె ప్రగతికి కింద నిర్దేశించిన పనులకు వినియోగించాలి.