న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్కు అప్పగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ బ్యాంకును టేకోవర్ చేసుకునేందుకు ఆర్బీఐ ముందు బిడ్లు దాఖలు చేసిన నాలుగు సంస్థల్లో సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్, భారత్-పే ఉన్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్కు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949లోని 22 (1) సెక్షన్ ప్రకారం సెంట్రం ఫైనాన్స్.. ప్రైవేట్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) యాజమాన్యం మొండి బకాయిల వివరాలను వెల్లడించకపోవడంతోపాటు పలు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ తనిఖీలో తేలింది. దీంతో 2019 సెప్టెంబర్లో ఈ బ్యాంకు లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ హెచ్డీఐఎల్కు ఇచ్చిన రుణాల వివరాలను ఆర్బీఐకి వెల్లడించకుండా పీఎంసీ బ్యాంకు దాచిపెట్టింది. 2019 సెప్టెంబర్ 19న జరిపిన తనిఖీల్లో హెచ్డీఐఎల్కు పీఎంసీ ఇచ్చిన రుణాలు రూ.6,500 కోట్ల పై చిలుకే.
మొత్తం పీఎంసీ బ్యాంకు మంజూరు చేసిన రుణాల్లో 73 శాతం హెచ్డీఐఎల్కే ఇచ్చింది. దీంతో పీఎంసీలో లావాదేవీలపై ఆర్బీఐ మరింత ఆంక్షలు విధించింది ఆర్బీఐ.
తొలుత రూ.1000 వరకే డిపాజిటర్లు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ.. తర్వాత వారి కష్టాలకు అనుగుణంగా రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతించింది. గతేడాది జూన్లో పీఎంసీపై విధించిన ఆంక్షలను 2020 డిసెంబర్ 22 వరకు పొడిగించింది.