విద్యుత్తు అధికారులకు ట్రాన్స్కో సీఎండీ అభినందనలు
కరీంనగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్న విజిలెన్స్ అండ్ ఏపీటీఎస్ పోలీస్ స్టేషన్ను కరీంనగర్లో ప్రత్యేకంగా నిర్మించారు. గురువారం ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు వర్చువల్ సిస్టం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని మాధవరావు వరంగల్ నుంచి ఆన్లైన్లో పర్యవేక్షించారు. కరీంనగర్లోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో రూ.27.48 లక్షల వ్యయంతో ఈ నూతన భవనాన్ని కేవలం 9 నెలల వ్యవధిలో నిర్మించారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు మరో 8 మంది కానిస్టేబుళ్లు, మిగతా సిబ్బంది ఉండే విధంగా ఈ భవనాన్ని అన్ని సౌకర్యాలతో ఆధునిక పద్ధతిలో నిర్మించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో జరిగే విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టేందుకు ఈ పోలీసులు కృషి చేస్తున్నారు. గతంలో పాత భవనంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ కోసం కొత్త భవనాన్ని నిర్మించడంపై స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదివరకు ఆదిలాబాద్లో మాత్రమే ఈ స్టేషన్కు ప్రత్యేక భవనం ఉంది. ఇపుడు ఇది తెలంగాణలోనే రెండో భవనంగా అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ కే మాధవరావు మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి వర్చువల్ సిస్టం ద్వారా ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఈ పోలీస్స్టేషన్ను ప్రారంభించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో జరిగే విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టేందుకు వీరు కృషిచేస్తారని అన్నారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే తమకు ప్రత్యేక పోలీసు స్టేషన్ భవనాన్ని నిర్మించి ఇవ్వడంపై విద్యుత్ సంస్థ అధికారులకు స్టేషన్ సీఐ శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.